రాజస్థాన్‌లో రెడ్‌ డైరీ కలకలం

రాజస్థాన్‌లో రెడ్‌ డైరీ కలకలం రేగింది. అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న వివరాలు అందులో ఉన్నాయంటూ ఇటీవల ఉద్వాసనకు గురైన మంత్రి రాజేంద్ర గుఢా రెడ్‌ డైరీ ప్రస్తావనను సోమవారం అసెంబ్లీలో తెచ్చారు.

Published : 25 Jul 2023 05:21 IST

ఎమ్మెల్యేలకు డబ్బు పంచిన వివరాలున్నాయన్న ఉద్వాసనకు గురైన మంత్రి

జైపుర్‌: రాజస్థాన్‌లో రెడ్‌ డైరీ కలకలం రేగింది. అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న వివరాలు అందులో ఉన్నాయంటూ ఇటీవల ఉద్వాసనకు గురైన మంత్రి రాజేంద్ర గుఢా రెడ్‌ డైరీ ప్రస్తావనను సోమవారం అసెంబ్లీలో తెచ్చారు. దీంతో సభలో కాంగ్రెస్‌ సభ్యులు ఆయనపై దాడి చేసి నెట్టేశారు. అంతేకాకుండా సభ నుంచి సస్పెండు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకూ ఆయనను సస్పెండు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాజస్థాన్‌ అసెంబ్లీ ఆమోదించింది. సభకు అంతరాయం కలిగిస్తున్నారని పేర్కొంటూ ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆయనతోపాటు భాజపా ఎమ్మెల్యే మదన్‌ దిలావర్‌నూ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండు చేశారు. గుఢాకు మద్దతుగా భాజపా ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేశారు. రెడ్‌ డైరీలను చూపుతూ సభను అడ్డుకున్నారు. అంతకుముందు రెడ్‌ డైరీని సభలో గుఢా ప్రదర్శించారు. ఆ తర్వాత దానిని ఎవరో దొంగిలించారని ఆరోపించారు.

ఏమిటీ రెడ్‌ డైరీ?

రాజస్థాన్‌ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్‌లో అవకతవకలకు సంబంధించి ఛైర్మన్‌ ధర్మేంద్ర రాఠోడ్‌ ఇంట్లో ఈడీ, ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సూచన మేరకు తాను రెడ్‌ డైరీని జాగ్రత్త పరిచానని రాజేంద్ర గుఢా తెలిపారు. అశోక్‌ గహ్లోత్‌, ఆయన కుమారుడు వైభవ్‌ గహ్లోత్‌ల సూచనల మేరకు డబ్బును ఎమ్మెల్యేలకు ఇచ్చానని రాఠోడ్‌ ఆ రెడ్‌ డైరీలో రాశారని వివరించారు. ‘ఈ డైరీని రాఠోడ్‌ రాశారు. అందులో ముఖ్యమంత్రి, ఆయన కుమారుడి పేర్లున్నాయి. సుమారు రూ.2.5 కోట్లను ఎమ్మెల్యేలకు ఇచ్చిన విషయం ఉంది. డబ్బు తీసుకున్న ఎమ్మెల్యేలకు నార్కో పరీక్ష చేయాలి. సోమవారం అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యులు తనపై దాడి చేసిన సందర్భంగా ఆ డైరీని లాక్కున్నారు. అయినా డైరీలో కొంత భాగం నా దగ్గర ఉంది. మంగళవారం పూర్తి వివరాలను వెల్లడిస్తా’ అని రాజేంద్ర గుఢా తన సస్పెన్షన్‌ అనంతరం సభ బయట వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని