2026 ఆగస్టు నాటికి తొలి బుల్లెట్‌ రైలు

అహ్మదాబాద్‌ - ముంబయి మార్గంలో అందుబాటులోకి రానున్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో కొంతభాగం 2026 ఆగస్టు నాటికి సిద్ధం కానుందని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

Published : 30 Nov 2023 05:08 IST

దిల్లీ: అహ్మదాబాద్‌ - ముంబయి మార్గంలో అందుబాటులోకి రానున్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో కొంతభాగం 2026 ఆగస్టు నాటికి సిద్ధం కానుందని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. గుజరాత్‌లోని సూరత్‌ నుంచి బిలిమోరా వరకు 50 కి.మీ. దూరం మొదట సిద్ధం అవుతుందన్నారు. కొవిడ్‌ ముందుతో పోలిస్తే కొత్త రైళ్ల సంఖ్యను పెంచామని కేంద్ర మంత్రి చెప్పారు. 1,768 మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల సంఖ్యను 2,124కు, సబర్బన్‌ సర్వీసులను 5,626 నుంచి 5,774 వరకు పెంచామన్నారు. ప్యాసింజర్‌ రైళ్ల సంఖ్య 2,792 ఉండగా ప్రస్తుతం 2,856కు పెరిగిందన్నారు. రైల్వే ట్రాక్‌లపై ప్రమాదాలను నిరోధించేందుకు కవచ్‌ వ్యవస్థ, ఏనుగుల వధ నిరోధానికి  గజ్‌రాజ్‌ వ్యవస్థతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అదనపు ట్రాక్‌ల ఏర్పాటుపై ఉన్నతాధికారులతో జరిపిన సమావేశంలో చర్చించామన్నారు. దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు అహ్మదాబాద్‌ - ముంబయి మధ్య పనులు ఊపందుకున్నాయి. ఈ రైలు కారిడార్‌ పొడవు 508.17 కిలోమీటర్లు. ఇప్పటికే 251 కి.మీ. మేర పిల్లర్లు, 103 కి.మీ. మేర ఎలివేటెడ్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం జరిగిందని రైల్వేమంత్రి ఇటీవలే తెలిపారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే సగం వ్యవధిలో (2.58 గంటల్లో) అహ్మదాబాద్‌ నుంచి ముంబయి చేరుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని