Supreme Court: చట్టసభ సభ్యుల శరీరాల్లో ‘చిప్‌’ పెట్టాలా!

సుపరిపాలనలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎల్లవేళలా పర్యవేక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Published : 02 Mar 2024 08:07 IST

24 గంటలూ వారిని పర్యవేక్షించమనడం సరికాదు
పిటిషనర్‌కు సుప్రీం మందలింపు

దిల్లీ: సుపరిపాలనలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎల్లవేళలా పర్యవేక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) సుప్రీంకోర్టు కొట్టివేసింది. చట్టసభ సభ్యులకు గోప్యతా హక్కు ఉంటుందనే విషయాన్ని గుర్తుచేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. 24 గంటలూ కదలికలను పర్యవేక్షించేందుకు వారి శరీరంలో ‘చిప్‌’ను పెట్టాలా? అని ప్రశ్నించింది. ‘‘మీరు ఏం కోరుతున్నారో అర్థమవుతుందా? ఎంపీ, ఎమ్మెల్యేలను 24 గంటలూ పర్యవేక్షించమంటారా..? ఇలాంటివి చట్టం నుంచి తప్పించుకొనే వారి విషయంలోనే చేస్తారు. గోప్యతా హక్కు అనేది ఒకటుంది. ఎన్నికైన పార్లమెంటు సభ్యులందర్నీ డిజిటల్‌గా పర్యవేక్షించేందుకు వారి శరీరాల్లో చిప్‌ పెట్టలేం. అయినా వాదిస్తామంటే.. తర్వాత మీ వాదనలతో మేం ఏకీభవించకపోతే మీ నుంచి రూ.5 లక్షలు వసూలు చేస్తాం. ఇది ప్రజా సమయం. ముఖ్యమైనవి అనేక అంశాలున్నాయి’’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. సుపరిపాలన ప్రజలకు అందాలంటే ఎంపీలు, ఎమ్మెల్యేలను అనుక్షణం పర్యవేక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దిల్లీకి చెందిన సురీందర్‌నాథ్‌ కుంద్రా సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేపీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా సేవకులని, కానీ, వాళ్లు పాలకుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని ధర్మాసనం దృష్టికి పిటిషనర్‌ తీసుకెళ్లారు. జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ఎంపీలందరిపై ఉమ్మడి అభియోగం మోపలేరని పేర్కొంది. ఇలాంటి అంశాలతో రావడం కోర్టు సమయాన్ని వృథా చేయడమేనంటూ పిటిషనర్‌ను తీవ్రంగా మందలిస్తూ.. పిల్‌ను కొట్టివేసింది.

అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకు జ్ఞానవాపీ మసీదు కమిటీ

దిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు స్థానంలో ఆలయ పునరుద్ధరణ కోసం హిందూ పక్షం వేసిన వ్యాజ్యాలు విచారణర్హమంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మసీదు కమిటీ.. అంజుమన్‌ ఇంతెజామియా దాఖలు చేసిన పిటిషన్‌ను ఆలకించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన పిటిషన్‌తో కలిసి దీన్ని విచారిస్తామని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర ధర్మాసనం పేర్కొంది. గతేడాది డిసెంబరు 9న, ఆలయ పునరుద్ధరణ కోరుతూ వేసిన వ్యాజ్యాలకు విచారణర్హత లేదంటూ మసీదు కమిటీ వేసిన పిటిషన్లను అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరించింది. వివాదాస్పద స్థల మత స్వభావాన్ని కేవలం కోర్టు మాత్రమే నిర్ణయిస్తుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని