బ్రిటన్‌కు తగ్గిన భారతీయ విద్యార్థులు

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భారత్‌ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ దరఖాస్తులు 21,800 మేరకు తగ్గిపోయినట్లు బ్రిటన్‌ జాతీయ గణాంకాల కార్యాలయం (ఓఎన్‌ఎస్‌) గురువారం తెలిపింది.

Updated : 24 May 2024 05:28 IST

21,800 మేర పడిపోయిన మాస్టర్స్‌ డిగ్రీ దరఖాస్తులు

లండన్‌: గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భారత్‌ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ దరఖాస్తులు 21,800 మేరకు తగ్గిపోయినట్లు బ్రిటన్‌ జాతీయ గణాంకాల కార్యాలయం (ఓఎన్‌ఎస్‌) గురువారం తెలిపింది. ఇది విదేశీ విద్యార్థులు చెల్లించే ఫీజులపై ఆధారపడిన బ్రిటిష్‌ విశ్వవిద్యాలయాలకు పెద్ద దుర్వార్త. బ్రిటన్‌లో విద్యాభ్యాసం కోసం వచ్చే భారతీయ విద్యార్థుల్లో 81 శాతం మంది మాస్టర్స్‌ డిగ్రీ చదవడానికే వస్తారు. ఈ ఏడాది నుంచి వారు తమ భార్యాపిల్లలను కానీ, తల్లిదండ్రులను కానీ తమ వెంట బ్రిటన్‌కు తీసుకురాకూడదనే నిబంధన తెచ్చారు. అదే భారతీయ మాస్టర్స్‌ దరఖాస్తుదారుల సంఖ్య తగ్గిపోవడానికి కారణమైంది. మాస్టర్స్‌ పూర్తిచేసిన తరువాత బ్రిటన్‌లో పనిచేస్తూ అనుభవం గడించే అవకాశం ఉండడం ఇంతవరకు భారతీయ విద్యార్థులకు ఆకర్షణీయంగా ఉండేది. నైపుణ్య సిబ్బంది వీసా గ్రాంట్లు భారతీయులకే       ఎక్కువగా లభిస్తున్నాయి. 2023 డిసెంబరుతో ముగిసిన సంవత్సరంలో బ్రిటన్‌కు దీర్ఘకాల వలస కోసం వచ్చిన విదేశీయుల్లో భారతీయులే (2,50,000) అత్యధికం. తదుపరి స్థానాలను నైజీరియన్లు (1,41,000), చైనీయులు (90,000), పాకిస్థానీలు (84,000) ఆక్రమిస్తున్నారు. 2023లో 12.2 లక్షల మంది బ్రిటన్‌కు వచ్చారని, వారిలో 5,32,000 మంది నిష్క్రమించారని ఓఎన్‌ఎస్‌ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని