India-Myanmar: భారత్‌-మయన్మార్‌ మధ్య ఇక యథేచ్ఛగా రాకపోకలు కుదరవ్‌

India-Myanmar: భారత్‌, మయన్మార్‌ మధ్య యథేచ్ఛగా జరుగుతున్న రాకపోకలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Updated : 08 Feb 2024 19:11 IST

దిల్లీ: పొరుగుదేశం మయన్మార్‌ (Myanmar)లో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో అక్కడి నుంచి కొందరు సైనికులు సరిహద్దులను దాటి భారత్‌ (India)లోకి ప్రవేశించడం ఇటీవల కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం చేపట్టింది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య యథేచ్ఛగా జరుగుతున్న రాకపోకలను నిలిపివేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం ‘ఎక్స్‌ (ట్విటర్‌)’ వేదికగా ప్రకటన చేశారు.

‘‘సరిహద్దులను మరింత బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా అంశం తదితర కారణాల దృష్ట్యా భారత్‌, మయన్మార్‌ మధ్య ‘స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని’ (Free Movement Regime) రద్దు చేయాలని హోంశాఖ నిర్ణయించింది. ఈ దిశగా చర్యలు మొదలుపెట్టాం. అందువల్ల తక్షణమే ఈ ఎఫ్‌ఎంఆర్‌ను నిలిపివేస్తున్నాం’’ అని అమిత్ షా స్పష్టం చేశారు.

మన్మోహన్‌జీ చక్రాల కుర్చీలోనూ పనిచేశారు.. మాజీ ప్రధానిపై మోదీ ప్రశంసలు

ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపుర్‌, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లు మయన్మార్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇప్పటి వరకు సరిహద్దు నుంచి ఇరువైపులా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. అయితే, ఇటీవల ఆ దేశం నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు పెరిగాయి. దీంతో వీటిని అరికట్టేందుకు సరిహద్దులో 1,643 కిలోమీటర్ల పొడవునా కంచెను నిర్మించనున్నట్లు అమిత్ షా ఇటీవల వెల్లడించారు. ఇప్పటికే మణిపుర్‌లోని మోరేలో 10 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. హైబ్రిడ్‌ నిఘా వ్యవస్థద్వారా మణిపుర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో కిలోమీటరు చొప్పున ఫెన్సింగ్‌ ఏర్పాటుకు పైలట్‌ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని