బుల్డోజర్‌తో కూల్చడం ఫ్యాషన్‌గా మారింది : మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యలు

బుల్డోజర్‌తో నిందితుడి ఇంటిని కూల్చడాన్ని మధ్యప్రదేశ్‌ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 

Updated : 12 Feb 2024 16:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రిమినల్‌ కేసులు నమోదైనవారి ఇళ్లు, ఆస్తులను బుల్డోజర్‌తో  పడగొట్టించడంపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు (High Court)కఠిన వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి విధివిధానాలు లేకుండా చర్యలు తీసుకోవడం పురపాలక అధికారులకు ఫ్యాషన్‌గా మారిందని వ్యాఖ్యానించింది. ఓ కేసుకు సంబంధించి నిందితుడి భార్య హైకోర్టును ఆశ్రయించగా.. ఈమేరకు వ్యాఖ్యలు చేసింది. 

మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్‌ లంగ్రి అనే వ్యక్తి ఓ ఆస్తి వివాదంలో ఒక వ్యక్తిని బెదిరించి అతడిపై దాడి చేశాడు. దీంతో ఆ బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో రాహుల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. అనంతరం పోలీసులు, పురపాలక అధికారులు కలిసి రాహుల్‌కు చెందిన రెండంతస్తుల భవనాన్ని కూలగొట్టారు. ఈ చర్యలపై రాహుల్‌ భార్య రాధ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 

ఈ భవనంపై చర్య తీసుకొనే సమయంలో దాని మాజీ యజమాని రైసాబీ పేరిట అధికారులు నోటీసులు జారీ చేసినట్లు ఆమె ఆరోపించారు. తమ గృహం అక్రమనిర్మాణం కాదని వాదించారు. ఆ ఇల్లు హౌసింగ్‌ బోర్డులో నమోదైందని.. బ్యాంకు రుణం కూడా పొందామని పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ అనంతరం జస్టిస్‌ వివేక్‌ రుసియా తీర్పు వెలువరించారు. 

బడ్జెట్‌ సమావేశాలు.. ప్రసంగించకుండానే వెళ్లిపోయిన గవర్నర్‌

ఇంటిని కూల్చివేయడాన్ని తప్పుపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను కూల్చడం, ఆ తర్వాత వాటిని పేపర్లో పబ్లిష్ చేయించుకోవడం ఫ్యాషన్‌గా మారిందని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ఆ ఇంటిని కూల్చే బదులు రెగ్యులరైజ్‌ చేయించుకోవాల్సిందిగా సూచించాలని అభిప్రాయపడ్డారు. అన్ని అవకాశాలు ఇచ్చాక చిట్టచివరి ఆప్షన్‌ కింద కూల్చివేతను ఎంచుకోవాలని సూచించారు. రాధకు రూ.లక్ష, ఆమె అత్త విమలా గుర్జర్‌కు మరో రూ.లక్ష పరిహారం కింద ఇవ్వాలని ఆదేశించారు. ఇంటిని కూల్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తీర్పులో పేర్కొన్నారు. మరోవైపు ఈ తీర్పులో తమకు మంజూరుచేసిన పరిహారంపై బాధిత మహిళలు అసంతృప్తి వ్యక్తంచేశారు. దీనిపై అప్పీలు చేస్తామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని