Agnikul: అంతరిక్షంలోకి భారత్‌ సరికొత్త ‘అగ్నిబాణ్‌’..!

భారత్‌లోని తొలి ప్రైవేటు స్పేస్‌ లాంచ్‌ ప్యాడ్‌ నుంచి అగ్నిబాణ్‌ రాకెట్‌ను నేటి ఉదయం విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రాజెక్టుకు చాలా విశేషాలున్నాయి. అవేమిటో తెలుసుకొందాం. 

Updated : 30 May 2024 16:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ అంతరిక్ష మార్కెట్లను ఒడిసిపట్టేలా భారత్‌ మరో కీలక ముందడుగు వేసింది. ప్రత్యేకశ్రేణి ఉపగ్రహాలను వీలైనంత వేగంగా.. కారు చౌకగా కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రయోగం చేపట్టింది. చెన్నై ఐఐటీ కేంద్రంగా పనిచేసే అగ్నికుల్‌ (Agnikul) సంస్థ ‘అగ్నిబాణ్‌’ పేరిట తొలిసారి సబ్‌-ఆర్బిటాల్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్‌ ప్రయోగాన్ని నిర్వహించింది. గురువారం ఉదయం 7.15 గంటల సమయంలో దీనిని ప్రయోగించినట్లు ఇస్రో ప్రకటించింది. ఇందులో తొలిసారి సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ లిక్విడ్ ఇంజిన్‌ కంట్రోల్డ్‌ ఫ్లైట్‌ నిర్వహించినట్లైంది. ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌ కూడా అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థను అభినందించారు. వాస్తవానికి ఈ ప్రయోగం దాదాపు నెలన్నర క్రితమే జరగాల్సింది. కానీ, నాలుగుసార్లు వాయిదా పడింది. ఐదోసారి విజయవంతంగా పూర్తి చేసుకొంది.  

ఏమిటీ పరీక్ష.. 

ఈ ప్రయోగం దాదాపు రెండు నిమిషాలపాటు సింగిల్‌ స్టేజ్‌లోనే జరిగింది. దీనిలో ప్రపంచంలోనే తొలిసారి తయారుచేసిన సింగిల్‌పీస్‌ త్రీడీ ప్రింటెడ్‌ సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ను అమర్చారు. దీనిపై అగ్నికుల్‌ కాస్మోస్‌కు పేటెంట్‌ ఉంది. ఇది సబ్‌కూల్డ్‌ ద్రవ ఆక్సిజన్‌ ఆధారంగా ఒక స్టేజిలోనే పనిచేసింది. ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేశారు. 

దీర్ఘ వృత్తాకార ముక్కుతో ఉన్న ఈ రాకెట్‌ పొడవు 6.2 మీటర్లు. దీని లోపలే ఉపగ్రహాన్ని అమర్చారు. ఈ రాకెట్‌లో తొలిసారి ఈథర్‌నెట్‌ ఆధారంగా పనిచేసే ఏవియానిక్స్‌ వ్యవస్థను వాడారు. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోపైలెట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను ఇందులో వినియోగించారు.

ఒకవేళ ప్రయోగం అదుపుతప్పితే తక్షణమే దానిని నాశనం చేసేలా ఇస్రో అభివృద్ధి చేసిన ఫ్లైట్‌ టర్మినేషన్‌ వ్యవస్థను కూడా దీనిలో అమర్చారు. పలురకాల లాంచర్ల నుంచి ప్రయోగించేలా దీనిని నిర్మించారు. 300 కిలోలలోపు బరువున్న ఉపగ్రహ ప్రయోగాలకు వెంటనే అవకాశాలు దొరకవు. ఇలాంటి వాటి కోసం అగ్నికుల్‌ నిర్మించిన రాకెట్‌ సరిపోతుందని భావిస్తున్నారు. 

తొలి ప్రైవేటు లాంచ్‌ ప్యాడ్‌పై ప్రయోగం రెండు నిమిషాలే..

ఈ మొత్తం ప్రయోగం దాదాపు రెండు నిమిషాలు మాత్రమే జరిగింది. ముగిశాక రాకెట్‌ సముద్రంలో కూలిపోయింది. శ్రీహరి కోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌సెంటర్‌లో ఏర్పాటుచేసిన తొలి ప్రైవేటు లాంచ్ ప్యాడ్‌ ఏఎల్‌పీ-01 (ALP-01) ఈ పరీక్షకు వేదికైంది. ఈ రాకెట్‌ ప్రయోగించిన తర్వాత నాలుగు సెకన్ల సమయంలో నిర్ణీత దిశకు మళ్లింది. 1.29 నిమిషాల సమయానికి ఇది నిర్దేశిత ప్రదేశానికి చేరి.. అక్కడినుంచి తిరిగి సముద్రంలో పడింది. అగ్నికుల్‌ ఇంజిన్‌, ఆకారం వాటిని విశ్లేషించి మరింత మెరుగుపర్చడానికి ఈ రెండు నిమిషాల పరీక్ష ఉపయోగపడనుంది.

ఈ ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర మంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌ అగ్నికుల్‌ సంస్థను అభినందించారు. ప్రపంచంలోనే తొలిసారి 3డీ ప్రింటెడ్‌ రాకెట్‌ ఇంజిన్‌ను కావడం విశేషమన్నారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని