Supreme Court: ఆప్‌ సర్కారుకు ఎదురుదెబ్బ.. దిల్లీ సీఎస్‌ పదవీకాలం పొడిగింపు

Supreme Court: దిల్లీ సీఎస్‌ (Delhi CS) పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్రం నిర్ణయం చట్టపరమైనదే అని పేర్కొంది.

Updated : 30 Nov 2023 21:55 IST

దిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Delhi CS) పదవీకాలం పొడిగింపు విషయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత సీఎస్‌ నరేశ్‌ కుమార్‌ పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) సమర్థించింది. కేంద్రం నిర్ణయాన్ని చట్టపరమైన ఉల్లంఘనగా చూడలేమని ధర్మాసనం ఈ సందర్భంగా వెల్లడించింది.

దిల్లీ సీఎస్‌ నరేశ్ కుమార్‌ ఈ నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉండగా...ఆయన స్థానంలో కొత్త సీఎస్‌ను నియమించే విషయమై దిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం, కేంద్ర సర్కారు మధ్య వివాదం నెలకొంది. దిల్లీ సీఎస్‌గా నరేశ్‌ కుమార్‌నే కొనసాగిస్తారా? లేదంటే కొత్తవారిని ఎంపిక చేస్తారా? అనే దానిపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమను సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కేజ్రీవాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇటీవల న్యాయస్థానం విచారణ జరపగా.. నరేశ్ కుమార్‌ పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని తాము నిర్ణయించినట్లు కేంద్రం కోర్టుకు తెలియజేసింది. దీనికి ధర్మాసనం స్పందిస్తూ..  పదవీ కాలం పొడిగింపు ప్రతిపాదనకు గల కారణాలను చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది.

భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు

ఈ క్రమంలోనే కేంద్రం బుధవారం తమ వివరణను న్యాయస్థానానికి సమర్పించింది. ‘‘చీఫ్‌ సెక్రటరీ పదవీకాలం పొడిగింపు అంశం.. దిల్లీ ప్రభుత్వ శాసన, కార్యనిర్వాహక వ్యవస్థ కిందకు రాదు. ప్రస్తుతం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వద్ద పెండింగ్‌లో ఉన్న పరిపాలన సేవలపై నియంత్రణ అంశంతో దీనికి సంబంధం లేదు. అందువల్ల సీఎస్‌ పదవీకాలాన్ని పొడిగించే హక్కు కేంద్ర హోంశాఖకు ఉంటుంది’’ అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. సీఎస్‌గా నరేశ్ కుమార్‌ పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించడాన్ని కోర్టు సమర్థించింది.

దిల్లీలో పరిపాలన సేవలపై నియంత్రణను ఎల్జీకి అప్పగిస్తూ కేంద్రం చట్టం తీసుకురాగా దీనిని ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనిపై విచారణ పెండింగ్‌లో ఉంది. అందువల్ల, తమను సంప్రదించకుండా కేంద్రం ఎలాంటి నియామకాలు చేపట్టరాదని దిల్లీ ప్రభుత్వం కోరుతోంది. ఈ క్రమంలోనే సీఎస్‌ పదవీకాలం పొడిగింపుపై సుప్రీంకోర్టుకు వెళ్లగా.. ఆప్‌ సర్కారుకు చుక్కెదురైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని