India: ఓ వైపు చైనాతో చర్చలు.. మరోవైపు ఆర్మీలో కీలక మార్పులు..!

సరిహద్దుల విషయంలో భారత్‌ చురుగ్గా వ్యవహరిస్తోంది. ఒక వైపు చైనాతో కోర్‌ కమాండర్‌ స్థాయిలో చర్చలు జరుపుతూనే.. వాస్తవాధీన రేఖ వద్ద మరిన్ని అదనపు బలగాలను సమకూర్చుకొనేలా వ్యూహం సిద్ధం చేసుకొంటోంది. 

Published : 21 Feb 2024 16:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాస్తవాధీన రేఖ వద్ద సరిహద్దు వివాదంపై చైనాతో చర్చలు కొనసాగిస్తూనే.. భారత్‌ తన సైన్యంలో కీలక మార్పులు చేస్తోంది. తాజాగా న్యూదిల్లీ-బీజింగ్‌ మధ్య 21వ విడత కోర్‌ కమాండర్‌ స్థాయి సమావేశం జరిగింది. దీనిని చుషూల్‌-మాల్డో సరిహద్దుల్లో భారత్‌ వైపు మీటింగ్‌ పాయింట్‌ వద్ద నిర్వహించారు. పూర్తిస్థాయిలో బలగాల ఉపసహరణే లక్ష్యంగా ఇవి జరిగాయి. ఇరుపక్షాలు సైనిక, దౌత్య కమ్యూనికేషన్లను కొనసాగించాలని అంగీకరించాయి. ఆ సమయంలో క్షేత్రస్థాయిలో ప్రశాంతత నెలకొల్పేటట్లు చూడాలని నిర్ణయించారు. గత చర్చల్లో కూడా దెప్సాంగ్‌, డెమ్‌చోక్‌ వద్ద పరిష్కారం కోసం భారత్‌ ప్రతినిధులు చైనాపై ఒత్తిడి తెచ్చారు. గల్వాన్‌ ఘర్షణ తర్వాత మొదలైన కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చల్లో పలు కీలక అంశాలను పరిష్కరించారు.

చైనాను ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహాలు..

సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్లెం వేసేలా భారత సైన్యంలో కీలక మార్పులు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సెంట్రల్‌ కమాండ్‌ అధీనంలో సరికొత్త కోర్‌లు ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. వీటిని స్వయంసత్తాక దళాల్లా తీర్చిదిద్దేలా శతఘ్ని, వైమానిక, ఇంజినీరింగ్‌ వంటి విభాగాలను ఏర్పాటు(కాంబాటైజ్‌) చేస్తున్నట్లు సెంట్రల్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. వీటిని 18 కోర్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.  దీనిలో ఒక డివిజన్‌ మూడు స్వతంత్ర బ్రిగేడ్లు ఉండనున్నాయి. వీటికి వాస్తవాధీన రేఖ వద్ద కొన్ని ప్రాంతాల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

14వేల మంది రైతులు..1200 ట్రాక్టర్లు: మళ్లీ మొదలుకానున్న ‘దిల్లీ చలో’

సెంట్రల్‌ కమాండ్‌ ఎల్‌ఏసీలో కొంత భాగాన్ని, నేపాల్‌ సరిహద్దుల బాధ్యతలు చూస్తోంది. ఇది బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో పనిచేస్తోంది. దీని పరిధిలో 13 కేటగిరీ ఏ శిక్షణ కేంద్రాలు, 18 రెజిమెంటల్‌ సెంటర్లు, లాజిస్టిక్స్ కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పటివరకు అడ్మినిస్ట్రేటివ్‌ కమాండ్‌గా ఉన్న దీని ముఖచిత్రం కూడా తాజా నిర్ణయంతో మారనుందని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని