INDIA bloc: కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా.. 31న ఇండియా కూటమి ‘మెగా మార్చ్’
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి.. మార్చి 31న దేశ రాజధానిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
దిల్లీ: ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్టును నిరసిస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి మెగా మార్చ్కు సిద్ధమైంది. దిల్లీలోని రామ్లీలా మైదానంలో మార్చి 31న కేజ్రీవాల్కు సంఘీభావంగా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపింది. విపక్ష కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఆప్లు దిల్లీలో ఆదివారం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి. కేజ్రీవాల్ను అరెస్టు చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆప్.. తాము చేపట్టబోయేది రాజకీయ సభ కాదని పేర్కొంది.
రాజకీయ నాయకులను బెదిరింపులకు గురిచేయడంతోపాటు విపక్షాల అడ్డు తొలగించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని ఆప్ నేత, దిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మండిపడ్డారు. ఝార్ఖండ్లో హేమంత్ సోరెన్, బిహార్లో తేజస్వి యాదవ్లపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కేజ్రీవాల్ కుటుంబాన్ని గృహ నిర్బంధం చేయడంతోపాటు, ఆప్ కార్యాలయాన్నీ సీజ్ చేశారని పేర్కొన్నారు. దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులను అరెస్టు చేయడం, రాజకీయ పార్టీల ఖాతాలను నిలిపివేయడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలపై విపక్ష పార్టీలు కలిసి పోరాడతాయని స్పష్టం చేశారు.
Kejriwal: అలా చేసుంటే కేజ్రీవాల్ అరెస్టయ్యేవారు కాదేమో: హిమంత
దిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ఆదివారం జైలు నుంచే పాలన ప్రారంభించారు. దిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. దీనిని ఓ నోట్ రూపంలో జల మంత్రిత్వశాఖను నిర్వహిస్తున్న ఆతిశీకు కేజ్రీవాల్ పంపించినట్లు సమాచారం. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆదివారం దిల్లీలో ఆప్ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.