Nijjar: నిజ్జర్‌ హత్యపై డాక్యుమెంటరీ.. భారత్‌లో నిషేధం

Nijjar's killing: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై కెనడా మీడియా డాక్యుమెంటరీ రూపొందించింది. దీన్ని భారత్‌లో ప్రసారం చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

Published : 14 Mar 2024 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య విషయంలో భారత్‌ను (India) ఉద్దేశిస్తూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ విభేదాలు కొనసాగుతున్న వేళ.. కెనడా మీడియా వ్యవహరించిన తీరు ఈ ఉద్రిక్తతలను మరోసారి పెంచింది. నిజ్జర్ హత్యపై ఆ దేశ మీడియా సంస్థ ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన కేంద్ర ప్రభుత్వం.. డాక్యుమెంటరీ (Documentary)పై నిషేధం విధించింది.

కెనడా ప్రభుత్వం అండతో నడిచే సీబీసీ అనే వార్తా సంస్థ.. ‘ది ఫిఫ్త్‌ ఎస్టేట్‌’ పేరుతో ఇన్వెస్టిగేటివ్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఇటీవల ఇందులోని ఓ ఎపిసోడ్‌లో నిజ్జర్‌ హత్యపై డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ‘కాంట్రాక్ట్‌ టు కిల్‌’ పేరుతో రూపొందించిన 45 నిమిషాల వీడియోలో ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా ఉన్నాయి. దీంతో ఇది కాస్తా మరోసారి వివాదానికి తెరతీసింది. ఈ డాక్యుమెంటరీ ఏకపక్షంగా ఉందని కొందరు ఇండో-కెనడియన్‌ కమ్యూనిటీ సభ్యులు ఆరోపించారు.

భారత్‌-చైనా సాయుధ ఘర్షణకు అవకాశం: అమెరికా ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలు

దీనిపై కేంద్ర ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ వీడియోపై నిషేధం విధించింది. దీన్ని భారత్‌లో ప్రసారం చేయొద్దని యూట్యూబ్‌, ఎక్స్‌ వంటి మాధ్యమాలను ఆదేశించింది. దీంతో ఈ డాక్యుమెంటరీని భారత యూజర్లు చూడకుండా ఆ మాధ్యమాలు యాక్సెస్‌ను పరిమితం చేశాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా మిగతాచోట్ల ఇది ప్రసారం అవుతుండటం గమనార్హం.

2023 జులై 18న బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల నిజ్జర్‌ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్‌ ఖండించింది. ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. ఇటీవల ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కెనడాలో వైరల్‌ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని