EC Press Meet: 64.2 కోట్ల మంది ఓటేశారు.. ప్రపంచ రికార్డు సృష్టించామన్న ఈసీ

EC Press Meet: సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపింది.

Updated : 03 Jun 2024 15:31 IST

దిల్లీ: మరికొద్ది గంటల్లో వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం యావత్‌ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) సోమవారం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఎన్నికల ముగింపుపై ఈసీ ఇటువంటి సమావేశాన్ని (EC Press Meet) ఏర్పాటుచేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈసందర్భంగా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను (Lok Sabha Elections) విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు వేయడంతో మనం ప్రపంచ రికార్డు సృష్టించినట్లు వెల్లడించారు.

పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారం.. వైకాపాకు సుప్రీంలో ఎదురుదెబ్బ

ఈసీ ప్రెస్‌మీట్‌ ముఖ్యాంశాలివే..

  • తాజా ఎన్నికల్లో మొత్తం 64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీ7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఈ సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ. ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ కావడం విశేషం. మన దేశంలో మొత్తం 96.88కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సమయంలో ఈసీ వెల్లడించింది.
  • ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తారు. 31.2 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లకు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు.
  • ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ ఇదే. 1.5కోట్ల మంది పోలింగ్‌, సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తించారు. 68,763 బృందాలు ఈ ఎన్నికలను పర్యవేక్షించాయి. 135 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చాం. ఎన్నికల ఏర్పాట్ల కోసం 4లక్షల వాహనాలను ఉపయోగించాం.
  • 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రీపోలింగ్  అవసరం రాలేదు. గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించగా.. ఈసారి ఆ సంఖ్య 39కు తగ్గింది. ఇందులో కేవలం రెండు రాష్ట్రాల్లోనే 25 చోట్ల రీపోలింగ్‌ జరిగింది.
  • గత నాలుగు దశాబ్దాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్‌ శాతం నమోదైంది. మొత్తం అక్కడ 58.58శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కశ్మీర్‌ లోయలో 51.05శాతం పోలింగ్‌ నమోదైంది.
  • ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నాం. రూ.10వేల కోట్ల విలువైన నగదు, కానుకలు, డ్రగ్స్‌, మద్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. 2019లో ఈ సంఖ్య రూ.3,500కోట్లుగా ఉంది.
  • ఈ ఎన్నికల సమయంలో సీ-విజిల్‌ యాప్‌లో 4.56 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. వీటిల్లో 99.9శాతం ఫిర్యాదులను పరిష్కరించాం. ఇందులో 87.5శాతం వాటికి 100 నిమిషాల్లోపే పరిష్కారం చూపాం. డీప్‌ఫేక్‌ వీడియోలను నిలువరించాం.

ఇక, జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపుపై ఈసీ స్పందించారు. కౌంటింగ్‌ ప్రక్రియ చాలా పటిష్ఠంగా జరగనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని