S Jaishankar: ఉగ్రవాదులకు రూల్స్‌ ఉండవు.. ప్రతిస్పందన కూడా అలాగే..!: జైశంకర్‌

S Jaishankar: ఉగ్రవాదులకు ఎలాంటి రూల్స్‌ ఉండవని, అలాంటప్పుడు వారి భాషలోనే ముష్కరులకు బదులివ్వాలని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించలేమన్నారు.

Updated : 13 Apr 2024 15:50 IST

పుణె: గత పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) అన్నారు. ఉగ్రవాదాన్ని (Terrorism) ఎదుర్కొనేందుకు ఈ మార్పే సరైన విధానమని తెలిపారు. ముష్కరులకు ఎలాంటి నియమాలు ఉండనప్పుడు.. దాడులకు ప్రతిస్పందన కూడా అలాగే ఉంటుందన్నారు.

మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్‌ పాల్గొన్నారు. ఉగ్రవాద ముప్పు, దేశ దౌత్య సంబంధాల వంటి అంశాలపై యువత అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఏయే దేశాలతో సంబంధాలు కొనసాగించడం కష్టంగా ఉందని అడగ్గా.. పొరుగున ఉన్న పాకిస్థాన్‌ (Pakistan) అని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని దాయాదిని ఉద్దేశిస్తూ మరోసారి తేల్చి చెప్పారు.

సౌదీ జైలు నుంచి కేరళ వ్యక్తిని విడిపించేందుకు రూ.34 కోట్ల సమీకరణ

‘‘పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని తమ ప్రయోజనాలకు ఉపయోగిస్తోందని మనం మొదట్నుంచీ స్పష్టంగా ఉంటే అప్పుడు భారత విదేశాంగ విధానం భిన్నంగా ఉండేది. అయితే, 2014 నుంచి మన విదేశీ విధానంలో 50 శాతం మార్పు వచ్చింది. అది కూడా ఉగ్రవాదంపై మనం స్పందించే తీరులోనే..! ముంబయి దాడుల తర్వాత ఉగ్రవాదంపై భారత్‌ స్పందించాలని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో పాకిస్థాన్‌పై దాడి చేయడం కంటే.. చేయకపోవడమే వల్లే ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఒకవేళ, 26/11 ముంబయి పేలుళ్ల వంటి ఘటన ఇప్పుడు జరిగితే దానికి మనం ప్రతీకారం తీర్చుకోకపోతే.. తర్వాతి దాడులను మనం ఎలా నిరోధించగలం..?’’ అని జైశంకర్‌ అన్నారు.

‘‘సరిహద్దులకు ఆవల ఉన్నాం కదా.. మనల్ని ఎవరూ టచ్‌ చేస్తారని ముష్కరులు అనుకుంటున్నారు. అది నిజం కాదని మనం రుజువు చేయాలి. ఉగ్రవాదులు ఎలాంటి రూల్స్‌ పెట్టుకుని దాడులు చేయరు.. అలాంటప్పుడు వారి చర్యలకు ప్రతిచర్యలు కూడా ఎలాంటి నియమాలకు లోబడి ఉండాల్సిన అవసరం లేదు’’ అని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని