ISRO: ప్రయోగాల పరంపర.. 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో

ISRO 2024లో కీలకమైన 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ రాజ్యసభకు తెలిపారు.

Published : 07 Dec 2023 17:32 IST

దిల్లీ: వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2024లో ముఖ్యమైన 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు (RajyaSabha) వెల్లడించింది. ఇందులో 6 పీఎస్‌ఎల్వీ (PSLV) ప్రయోగాలతోపాటు 3 జీఎస్‌ఎల్వీ (GSLV), ఒక లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM 3) మిషన్‌ ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా ఇస్రో అభివృద్ధి చేసిన సరికొత్త ప్రయోగ వాహక నౌక ఎస్‌ఎస్‌ఎల్వీ (స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌) ద్వారా ప్రయోగాత్మకంగా ఓ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించనున్నట్లు ఆయన తెలిపారు.

సహజీవనం ‘ప్రమాదకరమైన జబ్బు’.. లోక్‌సభలో భాజపా ఎంపీ

రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు ‘గగన్‌యాన్‌’ పేరిట భారత్‌ ప్రతిష్ఠాత్మక మిషన్‌ను చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కక్ష్య మాడ్యూల్‌ను నిర్ధారించుకునేందుకు మానవ రహిత మిషన్‌ను చేపట్టాలని ఇస్రో యోచిస్తున్నట్లు జితేందర్‌ సింగ్‌ తెలిపారు. దీంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో గగన్‌యాన్‌ లోని వ్యోమగాములు సురక్షితంగా బయటపడేందుకు వీలుగా అభివృద్ధి చేసిన ‘క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌’ను ధ్రువీకరించేందుకు మరో ప్రయోగం చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.

2024లో పీఎస్‌ఎల్వీ ద్వారా నింగిలోకి పంపాలని భావిస్తున్న 6 ఉపగ్రహాల్లో అంతరిక్ష పరిశోధన, భూ పరిశీలన ఉపగ్రహాలు, సాంకేతిక అభివృద్ధికి దోహదం చేసే 2 శాటిలైట్లు , 2 వాణిజ్య ఉపగ్రహాలు ఉన్నాయి. జీఎస్‌ఎల్వీ ద్వారా చేపట్టాలని యోచిస్తున్న 3 ప్రయోగాల్లో భాగంగా వాతావరణ శాస్త్ర ఉపగ్రహం, నేవిగేషన్‌ శాటిలైట్‌తోపాటు, నాసా- ఇస్రో సంయుక్త ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న సింథటిక్‌ అపెర్చర్‌ రేడార్‌ (SAR) ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఇవేకాకుండా 2 పునర్వినియోగ వాహక నౌక (Reusable Launch Vehicle)ల ప్రయోగాలను చేపట్టేందుకు ఇస్రో సమాయాత్తమవుతోంది. దీని ద్వారా న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెట్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌)తో చేసుకున్న ఒప్పందం ప్రకారం..జిశాట్‌ 20 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని