Kangana Ranaut: ఇందిరాగాంధీతో కంగన చిట్‌చాట్.. అదెలా సాధ్యమంటే..?

కంగనా రనౌత్‌(Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’(Emergency) చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన చిత్రాలు వైరల్‌గా మారాయి.

Updated : 28 Nov 2023 11:14 IST

ముంబయి: ‘ఎమర్జెన్సీ’(Emergency) చిత్రాన్ని ప్రకటించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut). ఆ సినిమాలో ఆమె మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ సమయంలో ఆమె నేరుగా ఇందిర చెంతనే కూర్చున్నట్లుగా ఉన్న చిత్రం వైరల్‌గా మారింది. వారిద్దరూ ఎదురెదురుగా కూర్చొని ఏదో చర్చిస్తున్నట్టుగా ఆ చిత్రంలో కనిపిస్తోంది. అధునాతన ఏఐ సాంకేతికతతో ఈ దృశ్యం సాకారమైంది.

‘ఐజీతో చాట్ చేయడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ కంగన(Kangana Ranaut) ఈ చిత్రాన్ని షేర్ చేశారు. ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రకు చిత్రబృందం ఐజీ అని కోడ్‌ నేమ్‌ పెట్టుకుంది. అలాగే ప్రధాని మోదీ (ఏఐ ఇమేజ్‌)తో దిగిన చిత్రాన్ని నటి పోస్టు చేశారు. దిల్లీలోని ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. 

గాంధీ మహా పురుషుడు.. మోదీ యుగ పురుషుడు: ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌

దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు అంకితం చేసిన కొత్త మ్యూజియం ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను సోమవారం కంగన సందర్శించారు. వీరాంగనా కీ మహాగాథ పేరిట ఆవిష్కరించిన లైట్‌ అండ్ సౌండ్‌ షోలో ఆమె పాల్గొన్నారు. ‘పురాతన, ఆధునిక విధానాల ద్వారా చరిత్రలోని అనేక అధ్యాయాలు ఈ షో ద్వారా నా కళ్లముందు ఆవిష్కృతమయ్యాయి. కుటుంబ సమేతంగా వచ్చి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పొందొచ్చు’ అని ఈ షో గురించి ఆమె వెల్లడించారు.

ఇక కంగనా రనౌత్‌(Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’(Emergency) రూపుదిద్దుకుంటోంది. స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా పరిగణించే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ‘మణికర్ణిక’ తర్వాత ఆమె దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఒక సందర్భంలో ఈ సినిమా గురించి కంగన మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని