Arvind Kejriwal: నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్‌

తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. 

Published : 19 Apr 2024 16:19 IST

దిల్లీ: 48 సార్లు భోజనంలో కేవలం మూడు మామిడి పండ్లు తీసుకున్నానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వెల్లడించారు. ఒక్కసారి మాత్రమే ఆలూపూరీ తిన్నానని చెప్పారు. అది కూడా నవరాత్రి ప్రసాదమని శుక్రవారం దిల్లీలోని రౌజ్‌ అవెన్యూ కోర్టుకు వెల్లడించారు. తిహాడ్‌ జైల్లో తనకు ఇన్సులిన్ అందించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా తన వాదనను వినిపించారు.

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi excise scam case)లో అరెస్టయిన ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్నారు. చక్కెర స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్‌ డాక్టర్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ ఆయన ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం దిల్లీ సీఎం అభ్యర్థనను వ్యతిరేకించిన ఈడీ.. ఆయనపై ఆరోపణలు చేసింది. ‘‘ఇంటి భోజనానికి కేజ్రీవాల్‌కు అనుమతి ఉంది. దీంతో ఆయన తనకు నచ్చిన ఆహారం తీసుకుంటున్నారు. టైప్‌-2 డయాబెటీస్‌తో బాధ పడుతున్నప్పటికీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అరటిపండు, మామిడి పండ్లు, స్వీట్లు, ఆలూ పూరీ వంటివి తింటున్నారు. ఇలాంటివి తింటే షుగర్‌లెవల్స్‌ పెరుగుతాయని ఆయనకు తెలుసు. ఆరోగ్య కారణాల కింద బెయిల్‌ పొందడం కోసం ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు’’ అని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది

 ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్‌నాథ్‌ సూచన

జైల్లో రోజుకు రెండుసార్లు కేజ్రీవాల్‌ షుగర్‌ లెవల్స్‌ను వైద్యులు చెక్‌ చేస్తున్నారని ఈడీ వెల్లడించింది. ఏప్రిల్‌ 1వ తేదీన జైలుకు తరలించిన రోజుతో పోలిస్తే ఇప్పుడు ఆయన చక్కెరస్థాయిలు రెట్టింపు అయినట్లు పేర్కొంది. అయితే ఈడీ ఆరోపణలను సీఎం తరఫు న్యాయవాది ఖండించారు. ఆయనకు ఇంటి భోజన సదుపాయం నిలిపివేసేందుకే ఇలా కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం జైల్లో కేజ్రీవాల్‌ తీసుకుంటున్న భోజనంతో పాటు ఆయన డైట్‌ ఛార్ట్‌పై నివేదిక ఇవ్వాలని తిహాడ్‌ జైలు నిన్న అధికారులను ఆదేశించింది. నేడు మరోసారి వాదనలు విన్న కోర్టు.. రెండు పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని