Arvind Kejriwal: పోలీసు అధికారిపై కేజ్రీవాల్‌ ఆరోపణలు..!

గతంలో ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియాను బలవంతంగా లాక్కెళ్లిన పోలీసు అధికారి తనతోనూ అనుచితంగా ప్రవర్తించారని కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కోర్టుకు వెల్లడించారు. 

Updated : 23 Mar 2024 11:35 IST

దిల్లీ: దిల్లీ పోలీసు అధికారి ఒకరు తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు. గతంలో తమనేత మనీశ్‌ సిసోదియా(Manish Sisodia)ను బలవంతంగా లాక్కెళ్లింది కూడా ఆయనేనని వెల్లడించారు. రౌజ్‌అవెన్యూ కోర్టులో సమర్పించిన అప్లికేషన్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. తన భద్రతా వలయంలోని సిబ్బంది నుంచి ఆయన్ను తొలగించాలని కోరారు. అయితే ఈడీ సిబ్బంది తనతో మర్యాదగానే ప్రవర్తించారని వెల్లడించారు. 

ఆపత్కాలంలో ఆప్‌!

ఈడీ వేసిన రిమాండ్ పిటిషన్ విచారణలో భాగంగా శుక్రవారం కేజ్రీవాల్‌ను రౌజ్‌అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చారు. ఆ సమయంలో అసిస్టెంట్ కమిషనర్ ఏకే సింగ్ తనతో దురుసుగా ప్రవర్తించారని సీఎం వెల్లడించారు. గతంలోనూ ఆ అధికారిపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అప్పట్లో వాదనల అనంతరం కోర్టు గది నుంచి సిసోదియాను బయటకు తీసుకువస్తుండగా.. మీడియా ఆయన్ను చుట్టుముట్టింది. అప్పుడు సింగ్‌ విలేకర్ల ఫోన్లను తోసేశారు. ‘‘రౌస్‌ అవెన్యూ కోర్టులో సిసోదియా (Manish Sisodia)తో ఓ పోలీసు దురుసుగా ప్రవర్తించారు. ఆయనను వెంటనే సస్పెండ్‌ చేయాలి’’ అని దిల్లీ మంత్రి అతిషి డిమాండ్‌ చేశారు. ఆ దృశ్యాలపై కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) స్పందిస్తూ.. ‘‘మనీశ్‌జీతో ఇలా దురుసుగా ప్రవర్తించే అధికారం పోలీసులకు ఉందా? లేదంటే ఇలా చేయమని పోలీసులను ఎవరైనా ఆదేశిస్తున్నారా?’’ అంటూ కేంద్రంపై పరోక్షంగా మండిపడిన సంగతి తెలిసిందే.

ఆప్‌ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ఇంట్లో సోదాలు..

కేజ్రీవాల్ అరెస్టు వేళ.. ఆప్‌ ఎమ్మెల్యే గులాబ్ సింగ్‌కు చెందిన ప్రాంగణాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ స్పందించారు. ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెట్టడంలో భాజపా బిజీగా ఉందని ఈ దేశంతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తెలుసని విమర్శించారు.

ఇదిలా ఉంటే.. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను ప్రత్యేక న్యాయస్థానం ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. దిల్లీ సీఎం అరెస్టు రాజకీయ కుట్రేనని ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని