Kejriwal: తిహాడ్‌ జైల్లో కేజ్రీవాల్‌.. తొలిరోజు నీరసం, పడిపోయిన షుగర్‌ లెవల్స్‌!

జ్యుడిషియల్‌ కస్టడీలో భాగంగా తిహాడ్‌ జైలులో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal).. తొలిరోజు నీరసంగా కనిపించినట్లు జైలు అధికారులు వెల్లడించారు.

Updated : 02 Apr 2024 18:47 IST

దిల్లీ: మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal).. జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా తిహాడ్‌ జైలులో (రిమాండ్‌ ఖైదీగా) ఉన్న సంగతి తెలిసిందే. ఆయన్ను 14x8 విస్తీర్ణం కలిగిన సెల్‌లో ఉంచారు. మొదటిరోజు రాత్రి కేవలం కొద్దిసేపు మాత్రమే నిద్రపోయినట్లు జైలు వర్గాలు వెల్లడించాయి.

‘కేజ్రీవాల్‌ను తిహాడ్‌ జైలుకు సోమవారం సాయంత్రం 4 గంటలకు తీసుకువచ్చారు. సెల్‌లోకి పంపించే ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పుడు ఆయన రక్తంలో చక్కెర స్థాయి 50 కంటే తక్కువ ఉంది. వైద్యుల సూచన మేరకు ఔషధాలు అందించాం’ అని జైలు అధికారులు వెల్లడించారు. జైల్లో ఆయనకు ఓ పరుపు, దుప్పట్లు, రెండు దిండ్లు సమకూర్చినట్లు సమాచారం. మధ్యాహ్నం చాయ్‌, రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అందించారు. రాత్రి కొద్దిసేపు కటిక నేలపైనే పడుకున్నారని, అర్థరాత్రి వరకూ సెల్‌లో అటు, ఇటు తిరుగుతూ కనిపించారని జైలు వర్గాలు వెల్లడించాయి.

త్వరలో మేం నలుగురం జైలుకు.. ఆతిశీ సంచలన వ్యాఖ్యలు

మంగళవారం ఉదయాన్నే తన సెల్‌లో ధ్యానం చేసుకున్న కేజ్రీవాల్‌కు.. అనంతరం చాయ్‌, రెండు బిస్కట్లు అందించారు. అనంతరం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్‌ లెవల్స్‌ తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం ఆయన జైలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అనుమతిస్తామని, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేవరకు వీటిని కొనసాగిస్తామని చెప్పారు.

సెల్ బయట జైలు వార్డర్‌ (జైలు అధికారి)తోపాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని నియమించారు. అత్యవసనర సేవల సిబ్బందినీ సెల్‌ సమీపంలో సిద్ధంగా ఉంచారు. సీసీకెమెరాల ద్వారా ఆయన్ను ఎప్పటికప్పుడు జైలు అధికారులు గమనిస్తున్నారు. కోరినవిధంగానే ఆయనకు రామాయణం, భగవద్గీత, ‘హౌ ప్రైమ్‌ మినిస్టర్స్‌ డిసైడ్‌’ అనే పుస్తకాలను అందించారు. దీంతోపాటు ఆయన మెడలో ఉన్న లాకెట్‌నూ అనుమతించారు.

నిబంధనల ప్రకారం ఆయన ఆరుగురు వ్యక్తులను కలిసేందుకు అవకాశం ఉంటుంది. ఆయన భార్య సునీత, ఇద్దరు పిల్లలు, వ్యక్తిగత కార్యదర్శి భిభావ్‌ కుమార్‌, ఆప్‌ జనరల్‌ సెక్రటరీ సందీప్‌ పాఠక్‌ల పేర్లను కేజ్రీవాల్‌ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం తిహాడ్‌ జైలులో నంబర్‌ 2 విభాగంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని