Kejriwal: తోటి ఖైదీలకు దూరంగా, పుస్తకాలు చదువుతూ.. తిహాడ్‌ జైల్లో కేజ్రీవాల్‌ దినచర్య!

తిహాడ్‌ జైలు నంబర్‌ 2లో (Tihar jail) ఉన్న కేజ్రీవాల్‌.. ధ్యానం, యోగాతోపాటు పుస్తకాలు చదవుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Published : 04 Apr 2024 15:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) తిహాడ్‌ జైల్లో ఓ చిన్న (14x8 అడుగుల విస్తీర్ణం) గదిలో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. జైలు నంబర్‌ 2లో (Tihar jail) ఉన్న ఆయన.. ధ్యానం, యోగాతోపాటు పుస్తకాలు చదవుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రోజులో రెండుసార్లు ధ్యానం, యోగా చేస్తున్న కేజ్రీవాల్‌ ఎక్కువ సమయం పుస్తకాలతోనే గడపుతున్నట్లు తెలిపాయి.

టీవీ ఉన్నప్పటికీ..

‘‘ఉదయం, సాయంత్రం గంటన్నరపాటు ఆయన యోగా, ధ్యానం చేస్తున్నారు. రామాయణం, భగవద్గీత, జర్నలిస్టు నీరజా ఛౌదరీ రాసిన ‘హౌ ప్రైమ్‌ మినిస్టర్స్‌ డిసైడ్‌ (How Prime Ministers Decide) పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకాలు చదువుతూ సెల్‌లో ఉన్న ఛైర్‌పై కూర్చొని ఏదో రాసుకుంటున్నట్లు కనిపించింది. గదిలో ఉన్న టీవీలో 20 ఛానళ్లు వీక్షించే వీలుంది. కానీ, దాన్ని చూసేందుకు ఆయన అంతగా ఇష్టపడటం లేదు’ అని జైలు వర్గాలు వెల్లడించాయి. జైలుకు వెళ్లిన మొదటిరోజు నీరసంగా కనిపించిన కేజ్రీవాల్‌కు మరుసటి రోజు చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చినట్లు పేర్కొన్నాయి.

తోటి ఖైదీలకు దూరంగా..

‘జైలు నిబంధనల ప్రకారం, అందరి ఖైదీల మాదిరిగానే కేజ్రీవాల్‌కు తన సెల్‌ను శుభ్రం చేసుకునేందుకుగాను ఒక చీపురు, బకెట్‌, చిన్న క్లాత్‌ అందించాం. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఒక టేబుల్‌, ఛైర్‌, ఎలక్ట్రిక్‌ కెటిల్‌ కూడా అందుబాటులో ఉంచాం. సెల్‌లో అమర్చిన రెండు సీసీ కెమెరాలతో ఆయన్ను 24గంటలూ జైలు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సెల్‌ బయట ఉన్న చిన్న లాబీలో నడిచేందుకు వెసులుబాటు ఉంది’ అని జైలు అధికారులు వెల్లడించారు. అయితే, భద్రతా కారణాల వల్ల తోటి ఖైదీలతో కలిసేందుకు ఆయన్ను అంగీకరించడం లేదని సమాచారం. వార్డు బయట సీఆర్‌పీఎఫ్‌, తమిళనాడు స్పెషల్‌ పోలీస్‌లతో కూడిన క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌ నిరంతరం పర్యవేక్షిస్తుంది. తన న్యాయవాదిని కలిసేందుకు వెళ్లే సమయంలో ఈ బృందం కేజ్రీవాల్‌కు తోడుగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని