Live-In RelationShip: 18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడం చట్ట విరుద్ధం: అలహాబాద్‌ హైకోర్టు

18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడంపై అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనాన్ని వివాహపరమైన సంబంధంగా పరిగణించేందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది.

Updated : 02 Aug 2023 17:39 IST

లఖ్‌నవూ: 18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడం చట్ట విరుద్ధం, అనైతికమని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. సహజీవనాన్ని వివాహపరమైన సంబంధంగా పరిగణించేందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. 18 ఏళ్లలోపు ఉన్న అబ్బాయి.. వయస్సులో తన కంటే పెద్దదైన అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడనే కారణంతో నేర విచారణ నుంచి రక్షణ పొందలేడని, వారి చర్యలు చట్టపరమైనవి కాదని జస్టిస్‌ వివేక్‌ కుమార్‌ బిర్లా, జస్టిస్‌ రాజేంద్ర కుమార్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. 

కొద్దిరోజుల క్రితం ఉత్తర్‌ ప్రదేశ్‌ (Uttar Pradesh)కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అబ్బాయి ఇంట్లోంచి వచ్చి ప్రయాగ్‌రాజ్‌లో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో అమ్మాయి కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారి ఆచూకీ తెలియడంతో అమ్మాయి కుటుంబసభ్యులు ఇద్దరిని బలవంతంగా వారి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తప్పించుకున్న అమ్మాయి.. జరిగిన ఘటన మొత్తాన్ని అబ్బాయి తండ్రికి తెలియజేసింది. దీంతో ఆయన అబ్బాయి తరపున కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దాంతోపాటు అబ్బాయిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని అమ్మాయి మరో పిటిషన్‌ దాఖలు చేసింది. 

ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్‌ చేయండి.. రాష్ట్రపతిని కోరిన ఇండియా కూటమి

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అలహాబాద్‌ న్యాయస్థానం 18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడం అనైతికమని వ్యాఖ్యానించింది. ఇద్దరు వ్యక్తులు తమ ఇష్టపూర్వకంగా జీవించేందుకు హక్కు ఉంటుందని, అయితే.. వారు మేజర్లు అయి ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నమోదైన కేసులో అబ్బాయిపై మోపిన నేరానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించని కారణంగా, నేరం జరిగిందనే అభిప్రాయానికి రాలేమని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై సమగ్ర విచారణ చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని