Manipur: ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్‌ చేయండి.. రాష్ట్రపతిని కోరిన ఇండియా కూటమి

మణిపుర్‌(Manipur) నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని ఇండియా (INDIA) కూటమి సభ్యులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu)కు సూచించారు. ఈ చర్య రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులను సరిదిద్దేందుకు సహాయపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.

Updated : 02 Aug 2023 14:57 IST

దిల్లీ: గత మూడు నెలలుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న మణిపుర్‌(Manipur) నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని ‘ఇండియా’ (INDIA) కూటమి సభ్యులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu)కు విజ్ఞప్తి చేశారు. ఈ చర్య రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులను సరిదిద్దేందుకు సహాయపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. మణిపుర్‌ పర్యటనకు వెళ్లి వచ్చిన 21 మంది ఇండియా కూటమి సభ్యులు బుధవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. మణిపుర్‌లో హింసాత్మక ఘటనల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆమెను కోరారు. 

రాష్ట్రపతిని ఇండియా కూటమి ఎంపీలు కలిసినప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌ (TMC) సభ్యురాలు సుస్మితా దేవ్‌ మణిపుర్‌ మహిళలను రాజ్యసభకు నామినేట్‌ చేయాలని అభ్యర్థించారు. అలాగే, మణిపుర్‌ ఘటనలపై పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని ప్రధాని మోదీని అడగాలని ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతిని కోరారు. ‘‘మణిపుర్‌లో వేర్వేరు వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని రాష్ట్రపతికి సూచించాం. ఈ చర్య రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను సరిదిద్దేందుకు ఉపయోగకరంగా ఉంటుంది’’ అని సుస్మితా దేవ్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌, జేడీయూ నాయకుడు రాజీవ్‌ రంజన్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, శివసేన (యూబీటీ) నాయకులు అర్వింద్‌ సావంత్‌, సంజయ్‌ రౌత్‌, టీఎంసీ నాయకులు సుదీప్‌ బంధోపాధ్యాయ, డెరెక్‌ ఒబ్రెయిన్‌లు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని