LS Polls 6th Phase: ఓటేసిన రాష్ట్రపతి.. జైశంకర్‌ది ‘తొలి ఓటు’.. ఆరో విడతలో ప్రముఖుల ఓటింగ్‌

LS Polls 6th Phase: ఆరో విడత లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు తొలి గంటల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Updated : 25 May 2024 10:38 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ (LS Polls 6th Phase Polling) శనివారం కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు నేడు ఓటింగ్‌ జరుగుతోంది. తొలి గంటల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు.

  • దేశ రాజధాని దిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu ) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ఆయన సతీమణి సుదేశ్‌ క్యూలైన్‌లో నిల్చుని ఓటు వేశారు.
  • కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన తొలి పురుషుడు ఈయనే కావడంతో అధికారులు సర్టిఫికేట్‌ ఇచ్చారు. ఆ విషయాన్ని ఆయన ఎక్స్‌లో పంచుకుంటూ తన సర్టిఫికెట్‌ చూపించారు.
  • కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమార్తె మిరయా, కుమారుడు రేహాన్‌ వాద్రా క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తొలి గంటల్లో ఓటేశారు.
  • తూర్పు దిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌, భాజపా లోక్‌సభ అభ్యర్థి బన్సూరీ స్వరాజ్‌, ఆమె తండ్రి కౌశల్‌ స్వరాజ్‌, కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ దంపతులు, పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ కుటుంబం, దిల్లీ మంత్రులు సౌరభ్‌ భరద్వాజ్‌, ఆతిశీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, హరియాణా సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ, మాజీ సీఈసీ సుశీల్ చంద్ర తదితరులు తొలి గంటల్లో ఓటేశారు.

లోక్‌సభ ఎన్నికల (Lok sabha Elections) ఆరో విడతలో భాగంగా దిల్లీ (Delhi)లోని మొత్తం 7 స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతోంది. పొత్తులో భాగంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 4, కాంగ్రెస్‌ 3 సీట్లలో అభ్యర్థులను బరిలో దింపాయి. భాజపా అభ్యర్థులకు వారు గట్టి సవాలు విసురుతున్నారు. మరోవైపు- ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా శనివారం పోలింగ్‌ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని