New Criminal Bills: న్యాయ సంహిత బిల్లులకు లోక్‌సభ ఆమోదం

New Criminal Bills: ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన మూడు న్యాయ సంహిత బిల్లులకు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది.

Updated : 20 Dec 2023 17:27 IST

దిల్లీ: బ్రిటిష్‌ హయాం నుంచి అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), సాక్ష్యాధార చట్టం (ఎవిడెన్స్‌ యాక్ట్‌) స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు రూపొందించిన మూడు నేర శిక్షాస్మృతి బిల్లుల (Criminal Law Bills)కు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. అనంతరం మూజువాణి ఓటింగ్‌ చేపట్టి ఈ బిల్లులను లోక్‌సభ ఆమోదించింది.

ఈ మూడు చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య (బీఎస్‌).. పేరుతో మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో తొలిసారి ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే, వీటిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో తాజా శీతాకాల సమావేశాల్లో వీటిని కేంద్రం వెనక్కు తీసుకుంది.

ఆ తర్వాత వీటిలో మార్పులు చేసి.. ‘భారతీయ న్యాయ (రెండో) సంహిత’, ‘భారతీయ నాగరిక్‌ సురక్షా (రెండో) సంహిత’, ‘భారతీయ సాక్ష్య (రెండో)’ బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లులను దిగువ సభ ఆమోదించడంతో వాటిని రాజ్యసభకు పంపనున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే వీటిని ఆమోదించుకోవాలని కేంద్రం ఆశిస్తోంది. ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లులు చట్టంగా మారనున్నాయి. డిసెంబరు 22 వరకు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.

అయితే, పార్లమెంట్‌లో 143 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ కొనసాగుతున్న వేళ ఈ బిల్లులను లోక్‌సభ ఆమోదించడం గమనార్హం. పార్లమెంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై చర్చకు పట్టుబట్టి నిరసన వ్యక్తం చేసిన విపక్ష సభ్యులను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభలో 97, రాజ్యసభలో 46 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. దీంతో ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్షాల సంఖ్య మూడో వంతుకు పడిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని