Lok Sabha polls: ప్రత్యర్థులపై ‘ప్రైవేటు కన్ను’!

ప్రత్యర్థులు, సహచరుల కదలికలపై దృష్టి పెడుతోన్న రాజకీయ పార్టీలు.. ప్రైవేటు డిటెక్టివ్‌ ఏజెన్సీలను (Detective Agency) సంప్రదిస్తున్నాయి.

Published : 20 Mar 2024 14:50 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) షెడ్యూల్‌ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు, టికెట్లు కోరుతున్న ఆశావహులు.. వారి ప్రత్యర్థులు, సహచరుల కదలికలపై దృష్టి పెడుతున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా ఇతర పార్టీల వ్యూహాలను పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ప్రైవేటు వ్యక్తులనూ నియమించుకుంటున్నాయి. దీంతో ప్రైవేటు డిటెక్టివ్‌ ఏజెన్సీలకు (Detective Agency) భారీ గిరాకీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ ఫిరాయింపులు, క్యాంపులు మార్చడం వంటి వ్యవహారాల నేపథ్యంలో.. కీలక సమాచారాన్ని ప్రత్యర్థులకు అందించే అవకాశం ఉన్న వారిపై నిఘా (Private Eye) ఉంచే పనిని డిటెక్టివ్‌ ఏజెన్సీలకు రాజకీయ పార్టీలు అప్పగిస్తున్నాయట. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఎవరు పార్టీలు మారే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తించడం వీరి పని. అనుకూలమైన ఫలితాలు రాబట్టేందుకు ఎంత ఖర్చుచేసేందుకైనా రాజకీయ పార్టీలు వెనకాడటం లేదని నిఘా సంస్థలు చెప్పడం గమనార్హం.

అభ్యర్థుల చరిత్రపై..

ప్రత్యర్థుల అవినీతి, నేర చరిత్ర, కుంభకోణాలు, అక్రమ సంబంధాలు, వీడియో సంబంధిత సమాచారం, అనుసరించాల్సిన వ్యూహాలే ప్రధాన అంశాలుగా డిటెక్టివ్‌లను నియమించుకుంటున్నారు. ప్రత్యర్థులతో తమ సహాయకులు, సిబ్బంది కుమ్మక్కు అవుతున్నారా? అనే విషయాన్ని ముందుగానే పసిగట్టేందుకు రాజకీయ నాయకులు, అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. అభ్యర్థుల జాబితాలో పేర్లు లేకపోవడంతో నిరాశకు గురైన వారితోపాటు, సీటు పొందిన వారు తమ ప్రత్యర్థుల బలాలను తెలుసుకునేందుకు డిటెక్టివ్‌లను సంప్రదిస్తున్నారని దిల్లీ కేంద్రంగా పనిచేసే జీడీఎక్స్‌ డిటెక్టివ్స్‌ లిమిటెడ్‌ ఎండీ మహేశ్‌ చంద్ర శర్మ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నిఘా అనేది ఎంతోకాలంగా ఉందన్నారు.

LS polls: ఎన్నికల నియమావళి.. తొలి ‘కోడ్‌’ కూసింది అప్పుడే!

ఎన్నికల తేదీలు ప్రకటించడానికి కొన్ని నెలల ముందు నుంచే రాజకీయ పార్టీలు వీరిని నియమించుకున్నట్లు సిటీ ఇంటెలిజెన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఎండీ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. కేవలం ప్రత్యర్థుల సమాచారమే కాకుండా అభ్యర్థుల బలాలు, ఎన్నికల్లో విజయం సాధిస్తే పదవుల నిర్వర్తించే సామర్థ్యాలపైనా నివేదికలు రూపొందించాలని కోరుతున్నట్లు చెప్పారు.

పార్టీల వ్యూహాలపైనా..

అభ్యర్థులే కాకుండా పార్టీలకు నగదు, మద్యం ఎక్కడ నుంచి వస్తోంది?, వాటిని ఎక్కడ నిల్వ చేస్తున్నారు? పంపిణీ చేసేందుకు ఎటువంటి పద్ధతులు అనుసరిస్తున్నారు? వంటివి కనిపెట్టే పనులను డిటెక్టివ్‌లకు అప్పగిస్తున్నట్లు రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

ప్రత్యర్థుల ప్రజాదరణతో పోలిస్తే తమ అభ్యర్థి బలాబలాలు, రాజకీయాల్లో కొత్త ముఖాలను దించే అంశంపైనా తమను సంప్రదిస్తున్నారని దిల్లీ కేంద్రంగా పనిచేసే మరో (Sleuths India) డిటెక్టివ్‌ ఏజెన్సీ ఎండీ నమాన్‌ జైన్‌ పేర్కొన్నారు. సమగ్ర సర్వేల ద్వారా ఎన్నికల ఫలితాలను కూడా అంచనా వేయడం మరో ముఖ్య అంశమన్నారు. ఇలా ఎన్నికల ప్రచార సమయంలో డిటెక్టివ్‌ల పాత్ర ఇటీవల గణనీయంగా పెరిగిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని