Tax Notice: కాలేజీ విద్యార్థికి రూ.46 కోట్ల పన్ను నోటీసులు..

Tax Notice To Student: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థికి రూ.46 కోట్ల పన్ను నోటీసులు రావడం కలకలం రేపింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 30 Mar 2024 19:00 IST

గ్వాలియర్‌: కాలేజీకెళ్లి చదువుకునే విద్యార్థి బ్యాంకు ఖాతా నుంచి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీంతో ఆదాయపు పన్ను అధికారులు అతడికి పన్ను నోటీసులు (Tax Notice) పంపారు. కంగుతిన్న ఆ విద్యార్థి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో వెలుగు చూసిందీ ఘటన. వివరాల్లోకి వెళితే..

గ్వాలియర్‌కు చెందిన ప్రమోద్‌ కుమార్‌ దండోటియా స్థానిక కళాశాలలో చదువుకుంటున్నాడు. ఇటీవల అతడికి ఐటీ, జీఎస్‌టీ నుంచి పన్ను నోటీసులు వచ్చాయి. అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయని, అందుకు గానూ పన్ను చెల్లించాలనేది వాటి సారాంశం. దీంతో ఆ విద్యార్థి సంబంధిత అధికారులను సంప్రదించగా తన పాన్‌ కార్డుపై ఓ కంపెనీ రిజిస్టర్‌ అయినట్లు తెలిసింది.

విపక్షాలకు పన్ను పోట్లు.. రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ కాంగ్రెస్‌కు మళ్లీ ఐటీ నోటీసు

ఆ కంపెనీ 2021 నుంచి ముంబయి, దిల్లీ వేదికగా కార్యకలాపాలు సాగించిందని తెలుసుకున్న అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ లావాదేవీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ కంపెనీ గురించి తనకు తెలియదని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘‘ఆ విద్యార్థి పాన్‌ కార్డును గుర్తుతెలియని వ్యక్తులు దుర్వినియోగం చేసి కంపెనీని రిజిస్టర్‌ చేశారు. ఆ తర్వాతే అతడి బ్యాంకు అకౌంట్‌ నుంచి రూ.కోట్లలో లావాదేవీలు జరిగాయి. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది’’ అని పోలీసులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని