Rashmika Mandanna: అటల్‌ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ

అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. 

Updated : 17 May 2024 10:47 IST

ముంబయి: వాణిజ్య రాజధాని ముంబయి (Mumbai)లో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’ (MTHL)పై ఇటీవల రష్మిక (Rashmika Mandanna) ప్రయాణించారు. ఈ అటల్‌ సేతును కారులో నుంచి వీక్షిస్తూ.. దాని గురించి మాట్లాడుతోన్న వీడియోను ఆమె తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ(Modi) స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే మించిన సంతృప్తి ఏముంటుందని సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ గౌరవార్థం ఎంటీహెచ్‌ఎల్‌కు ‘అటల్‌ సేతు’(Atal Setu)గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.

‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక

నవీ ముంబయి నుంచి ముంబయి, గోవా నుంచి ముంబయి, బెంగళూరు నుంచి ముంబయి.. ఇలా అన్ని ప్రయాణాలు అద్భుతమై మౌలికసదుపాయాల కారణంగా సులభతరమైనప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. భారత్‌లో ఇది సాధ్యం కాదు అనే పరిస్థితి లేదు. గత పదేళ్ల కాలంలో దేశం గొప్ప ప్రగతి సాధించింది. ఈ వంతెన ఏడేళ్లలో పూర్తయిందని నాకు ఇటీవలే తెలిసింది. ఈ 20 కిలోమీటర్లు అద్భుతం. మొదట దీనిని చూసినప్పుడు నాకు మాటలు రాలేదు. ఈ యువభారతం అత్యంత వేగంగా, తెలివిగా దూసుకెళ్తోంది. ఇప్పుడు మనం అభివృద్ధికి ఓటు వేయాలి’’ అని జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ నటి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’ (MTHL)ను జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.  దేశంలోనే పొడవైన వంతెన ఇది. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌లోని నహవా శేవాను కలుపుతూ ₹21,200కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించిన అటల్‌ సేతు మొత్తం పొడవు 21.8 కి.మీ.లు కాగా.. అందులో 16 కి.మీ.లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉండటం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని