JKCA: మనీలాండరింగ్‌ కేసు.. ఫరూక్‌ అబ్దుల్లాకు మరోసారి ‘ఈడీ’ సమన్లు

జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ సంఘంలో నిధుల అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, మాజీ మఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాకు ‘ఈడీ’ సమన్లు జారీ చేసింది.

Published : 12 Feb 2024 21:49 IST

శ్రీనగర్‌: నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, మాజీ మఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా (Farooq Abdullah)కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ సంఘం (JKCA)లో నిధుల అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 13న (మంగళవారం) విచారణకు హాజరుకావాల్సిందిగా సూచించింది. గత నెల 11న సైతం ఈడీ సమన్లు జారీ చేయగా.. ఆయన గైర్హాజరయ్యారు.  ఈ కేసులో గతంలోనూ ఫరూక్‌ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నించింది. భూ కుంభకోణం కేసులో ఇటీవలే ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేయగా, మద్యం కుంభకోణం కేసులో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ వరుసగా సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

బుల్డోజర్‌తో కూల్చడం ఫ్యాషన్‌గా మారింది : మధ్యప్రదేశ్‌ హైకోర్టు

శ్రీనగర్‌ లోక్‌సభ నుంచి ఎంపీగా ఉన్న ఫరూక్‌ అబ్దుల్లా (86).. ‘జేకేసీఏ’కు 2001 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. 2004-09 మధ్యకాలంలో ఈ సంఘానికి సంబంధించిన నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు రావడంతో.. తొలుత సీబీఐ రంగంలోకి దిగింది. కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. మనీలాండరింగ్‌ అంశం కావడంతో సీబీఐ ఛార్జిషీట్‌ ఆధారంగా ఈడీ సైతం విచారణ చేపట్టింది. బీసీసీఐ స్పాన్సర్‌గా ఉన్న ఈ అసోసియేషన్‌లో కొందరు ఆఫీస్‌ బేరర్‌లతోపాటు ఇతరుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మళ్లినట్లు గుర్తించింది. జేకేసీఏ బ్యాంకు ఖాతాల్లోంచి నగదు విత్‌డ్రా అయినట్లు ఈడీ విచారణలో తేలింది. దీంతో 2022లోనే ఫరూక్‌పై దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని