Nursing college scam: సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు

మధ్యప్రదేశ్‌లో బయటపడిన నర్సింగ్‌ కాలేజీ స్కామ్‌కు సంబంధించి దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులే అవినీతికి పాల్పడినట్లు వెల్లడైంది.

Published : 22 May 2024 00:08 IST

దిల్లీ: ఓ కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తోన్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులే అవినీతికి పాల్పడిన కేసు ఇది. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న నర్సింగ్‌ కాలేజీ స్కామ్‌ వ్యవహారంలో తనిఖీలకు వెళ్లిన అధికారులే లంచాలు తీసుకున్నారు. అనుకూలమైన నివేదిక ఇచ్చేందుకు ఒక్కో కాలేజీ నుంచి భారీ స్థాయిలో నగదు వసూలు చేశారు. ఈ వ్యవహారం వెలుగుచూడడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పలువురు సీబీఐ అధికారులతో పాటు 22 మంది బయటి వ్యక్తులపైనా కేసు నమోదు చేశారు. వీరిలో పలువురిని అరెస్టు చేసినట్లు సీబీఐ వెల్లడించింది.

మధ్యప్రదేశ్‌లో ఇటీవల నర్సింగ్‌ కాలేజీ కుంభకోణం వెలుగుచూసింది. దీనిపై అక్కడి హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొన్ని కాలేజీలను తనిఖీ చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ పలు బృందాలను ఏర్పాటుచేసింది. వీరిలో దర్యాప్తు సంస్థ సిబ్బందితోపాటు ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌, పట్వారీలు, ఇతర సిబ్బంది ఉన్నారు. అయితే, తనిఖీల సమయంలో ఈ బృందాలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి.

ఏసీపీ నివాసంలో 12 గంటలుగా సోదాలు.. బయట పడుతున్న నోట్ల కట్టలు

కాలేజీలకు అనుకూల నివేదికలు ఇచ్చేందుకు గాను రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లంచాల రూపంలో స్వీకరిస్తున్నట్లు తెలిసింది. వాటిని సీబీఐ అధికారులు పంచుకున్నారు. వీటికి అదనంగా దర్యాప్తు బృందానికి కేటాయించిన ఒక్కో నర్సింగ్‌ అధికారికి రూ.50వేల వరకు, పట్వారీలకు రూ.20వేల వరకు తీసుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ప్రాథమిక సమాచారం సేకరించింది.

నిర్థరించుకోని, నిశిత పరిశీలన చేసిన సీబీఐ.. మెరుపు దాడులు జరిపి పలువురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. సీబీఐ డిప్యూటీ ఎస్పీతోపాటు మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, మరో 22 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరితోపాటు ఎనిమిది నర్సింగ్‌ కాలేజీల డైరెక్టర్లు, ఛైర్‌పర్సన్లు, కాలేజీల సిబ్బంది, మధ్యవర్తులపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అవినీతికి పాల్పడితే ఎవర్నీ వదిలిపెట్టేది లేదనే విషయం తాజా కేసుతో రుజువవుతోందని సీబీఐ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని