Gun Fire : వాకింగ్‌ చేస్తుండగా.. భాజపా నేత దారుణ హత్య

ఉత్తర ప్రదేశ్‌లో ఓ భాజపా నాయకుడిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

Updated : 11 Aug 2023 11:53 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో ఓ భాజపా (BJP) నేతను ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అందరూ చూస్తుండగానే తుపాకీతో కాల్చి అక్కడి నుంచి పరారయ్యారు. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మొరాదాబాద్‌ ప్రాంతంలో తన నివాసం ముందు భాజపా నేత అనూజ్‌ చౌదరి (Anuj Chaudhary) తన సోదరుడితో కలిసి వాకింగ్‌ చేస్తుండగా.. ముఖానికి మాస్కులు ధరించిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అయన్ను అనుసరించి వెనుక నుంచి కాల్చారు. కిందపడిపోగానే మరో రెండు సార్లు కాల్చి పరారయ్యారు.

వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది రాజకీయ హత్యేనని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనూజ్‌ చౌదరి స్థానిక రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. గతంలో తనకు ప్రాణహాని ఉందని సంభాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భాజపా అగ్రనేతలతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అప్పట్లో ఆయనకు భద్రత కల్పించారు. అయితే ఆ తర్వాత ప్రత్యర్థులతో అనూజ్‌కు రాజీ కుదర్చడంతో ఆ భద్రతను ఉపసంహరించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని