P Chidambaram: కచ్చతీవు రగడ.. కొందరు ఎంత వేగంగా రంగులు మార్చగలరో..?

కచ్చతీవు (Katchatheevu) అంశంలో డీఎంకే, కాంగ్రెస్‌పై విమర్శలు చేసేందుకు ఇప్పుడు కేంద్రమంత్రి జై శంకర్‌కు కొత్తగా కనిపించిన కారణం ఏంటో..? అని కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నించారు.  

Updated : 01 Apr 2024 17:48 IST

దిల్లీ: కచ్చతీవు (Katchatheevu) వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్(S Jaishankar) ఎందుకు పిల్లిమొగ్గలు వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం ప్రశ్నించారు. దేశానికి ద్రోహం చేసి ఆ ద్వీపాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంకకు అప్పగించారంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలను సమర్థిస్తూ జై శంకర్ స్పందించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఎక్స్‌(ట్విటర్) వేదికగా హస్తం పార్టీ నేత స్పందించారు.

‘‘గత 50 ఏళ్లుగా మత్స్యకారుల్ని నిర్బంధిస్తున్నారన్నది వాస్తవం. అలాగే శ్రీలంక మత్స్యకారుల్ని భారత్ అదుపులోకి తీసుకుంటుంది. శ్రీలంకతో కేంద్రంలోని ప్రతీ ప్రభుత్వం చర్చలు జరిపి, వారిని విడిపిస్తోంది. జై శంకర్.. ఫారిన్‌ సర్వీస్‌ ఆఫీసర్‌గా, విదేశాంగ శాఖ సెక్రటరీగా, విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఘటనలు జరిగాయి. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదా..? తమిళనాడులో ఇతర పార్టీలతో అధికార భాజపా పొత్తులో ఉన్నప్పుడు జరగలేదా..? ఇప్పుడు కాంగ్రెస్‌, డీఎంకేపై విమర్శలు చేయడానికి కొత్తగా కనిపించిన కారణం ఏంటి..? 27-1-2015 నాటి ఆర్టీఐ సమాధానాన్ని ఒకసారి చూడండి. ఆ దీవిని శ్రీలంకకు ఇవ్వడానికి గల కారణాన్ని అందులో వివరించారు. కానీ ఇప్పుడు ఎందుకు ఆ మంత్రిత్వ శాఖ పిల్లిమొగ్గలు వేస్తోంది. ఒక ఉదారవాద అధికారి ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌-భాజపా మౌత్‌పీస్‌గా మారిపోయారు. కొందరు ఎంత వేగంగా రంగులు మార్చగలరో’’ అని మంత్రిని ఉద్దేశించి విమర్శించారు.

కచ్చతీవు అంశం ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చింది కాదని, దీనిపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య చర్చ జరుగుతూనే ఉందని విదేశాంగ శాఖ మంత్రి చెప్పారు. ‘‘మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దృష్టిలో ఇది చిన్న ద్వీపం. దీనికి ప్రాముఖ్యతే లేదని భావించి వదిలించుకోవాలనుకున్నారు. ఇందిరాగాంధీ కూడా ఇదే అభిప్రాయంతో నిర్ణయాలు తీసుకున్నారు’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని