పార్లమెంట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా 

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నివరధికంగా వాయిదా పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నిర్ణీత షెడ్యూల్‌ కన్నా ముందే ఉభయ సభల సమావేశాల.....

Updated : 25 Mar 2021 16:30 IST

దిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నిర్ణీత షెడ్యూల్‌ కన్నా ముందే ఉభయ సభల సమావేశాలూ ముగించారు. గురువారం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను ముగించిన అనంతరం ప్యానల్‌ స్పీకర్‌ భర్తృహరి మెహతాబ్‌ సభను నిరవధికంగా వాయిదా వేశారు. స్పీకర్‌ ఓంబిర్లా వైరస్‌ బారిన పడటంతో ఆయన సభా కార్యకలాపాలకు హాజరుకావడంలేదు. దీంతో భర్తృహరి మెహతాబ్‌ ప్యానల్‌ స్పీకర్‌గా వ్యవహరించారు. లోక్‌సభలో 14.42గంటల పాటు చర్చ సాగింది. రూల్‌ 377 కింద సభ్యులు 405 అంశాలను లేవనెత్తారు. అలాగే, బడ్జెట్‌ సెషన్‌లో లోక్‌సభలో18 బిల్లులకు ఆమోద ముద్ర లభించింది. 

మరోవైపు, రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. ఎగువ సభ పనితీరుకు సంబంధించిన వివరాలను రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు వెల్లడించారు. 116గంటలకు గాను 104గంటల పాటు పనిచేసిందని తెలిపారు. జనవరి 29 నుంచి ఏప్రిల్‌ 8వరకు మొత్తంగా 33 సిట్టింగ్‌లు జరగాల్సి ఉంఉడగా.. 23 సిట్టింగ్‌లు జరిగినట్టు వివరించారు.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రెండు దశల్లో కొనసాగాయి. తొలి విడత సమావేశాలు జనవరి 29న ప్రారంభమై ఫిబ్రవరి 13తో ముగిశాయి. రెండో విడత సమావేశాలు మార్చి 8న ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఏప్రిల్‌ 8 వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ.. పశ్చిమబెంగాల్‌, కేరళ, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ త్వరగా ముగించాలని పలువురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సమావేశాలను నిర్ణీత షెడ్యూల్‌ కన్నా ముందే ముగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని