LS Polls: ఆరో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్‌!

లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌ ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో మొత్తం 889 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.

Updated : 25 May 2024 21:21 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ఆరో దశ పోలింగ్‌ ముగిసింది. ఈ విడతలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో మొత్తం 889 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎన్నికల సంఘం (Election Commission) రాత్రి 7.45 గంటలకు వెల్లడించిన వివరాల ప్రకారం.. దాదాపు 59.06 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 78.19 శాతం, అత్యల్పంగా జమ్మూ-కశ్మీర్‌లో 52.28 శాతం ఓటింగ్‌ నమోదైంది. దేశ రాజధాని దిల్లీలో 54.48 శాతం ఓట్లు పోలయ్యాయి. హరియాణాలోని కర్నాల్‌ అసెంబ్లీకి ఉప ఎన్నిక, ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకూ నేడు ఓటింగ్‌ నిర్వహించారు.

‘పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం అసాధ్యం’.. నియోజకవర్గాల వారీగా లెక్కలు వెల్లడి

పోలింగ్‌ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ.. తన పార్టీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను నిర్బంధించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. పూంచ్‌ జిల్లాలో ఇరుపార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు గాయపడ్డారు. దేశంలో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. ఆరో దశతో కలిపి ఇప్పటివరకు 486 సీట్లకు పోలింగ్‌ పూర్తయ్యింది. జూన్‌ 1న చివరిదైన ఏడో దశతో పోలింగ్‌ ప్రక్రియకు తెరపడనుంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని