PM Modi: ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. తొలిసారి కశ్మీర్‌ లోయకు మోదీ..!

PM Modi: ప్రధాని మోదీ వచ్చేవారం కశ్మీర్‌ లోయలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. శ్రీనగర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు సమాచారం.

Published : 28 Feb 2024 13:10 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 (Article 370)ని రద్దు చేసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) తొలిసారి కశ్మీర్‌ లోయ (Kashmir Valley)లో పర్యటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మార్చి 7వ తేదీన శ్రీనగర్‌లో జరిగే ర్యాలీలో ప్రధాని పాల్గొననున్నట్లు తెలిపాయి.

శ్రీనగర్‌లోని షేర్‌ ఈ కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సెంటర్‌లో ప్రధాని సభ జరగనున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. మోదీ పర్యటనను పురస్కరించుకుని కశ్మీర్‌ లోయలో ఇప్పటికే హైఅలర్ట్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు.. వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ఫిబ్రవరి 20న ప్రధాని జమ్మూలో పర్యటించిన సంగతి తెలిసిందే. రూ.32వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

కేరళలో కుస్తీ.. ఇతరచోట్ల దోస్తీ: కాంగ్రెస్‌-కమ్యూనిస్టుల బంధాలపై మోదీ ఎద్దేవా

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టులో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. అప్పటి నుంచి ప్రధాని మోదీ మూడు సార్లు జమ్మూలో పర్యటించగా.. కశ్మీర్‌ లోయకు వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ ప్రధాని పర్యటన కీలకంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని