Fake Toll Plaza: రోడ్డు వేసి.. నకిలీ టోల్‌ ప్లాజా కట్టి.. ₹కోట్లు కొట్టేసి: గుజరాత్‌లో ఘరానా మోసం

Fake Toll Plaza: గుజరాత్‌లో ఘరానా మోసం బయటపడింది. కొందరు మోసగాళ్లు ఏకంగా రోడ్డు వేసి.. మధ్యలో టోల్‌ ప్లాజా కట్టేశారు. ఏడాదిన్నరగా రూ. కోట్లు వసూలు చేస్తున్నా అధికారులు దీన్ని గుర్తించకపోవడం గమనార్హం.

Updated : 08 Dec 2023 15:21 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ (Gujarat)లో మరోసారి ‘నకిలీ’ వ్యవహారం కలకలం రేపింది. మోర్బీ జిల్లాలో కొందరు మోసగాళ్లు బైపాస్‌ రోడ్డును నిర్మించి.. మధ్యలో టోల్‌ ప్లాజా (Fake Toll Plaza) ఏర్పాటు చేశారు. ఏకంగా ఏడాదిన్నర పాటు వాహనదారుల నుంచి టోల్‌ వసూలు చేసి రూ. కోట్లు దండుకున్నారు. వివరాల్లోకి వెళితే..

మోర్బీ, కచ్‌ జిల్లాలను కలిపే 8ఏ నంబరు జాతీయ రహదారిపై వాఘసియా టోల్‌ ప్లాజా ఉంది. అయితే ఈ టోల్‌ ప్లాజా (Fake Toll Plaza) తగలకుండా ఉండేందుకు కొందరు వాహనదారులు పక్కనే ప్రత్యామ్నాయంగా ఉన్న మరో మార్గంలో వెళ్తుండేవారు. దీన్ని గమనించిన కొందరు మోసగాళ్లు.. ఈ మార్గంలో నిరుపయోగంగా ఉన్న ఓ సిరామిక్‌ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకున్నారు. దానికి ఇరువైపులా హైవే వరకు బైపాస్‌ రోడ్డును నిర్మించి.. ఫ్యాక్టరీలో టోల్‌ ప్లాజాను ఏర్పాటు చేశారు.

దాదాపు ఏడాదిన్నర నుంచి ఈ ‘నకిలీ టోల్‌ ప్లాజా’ను నడిపిస్తున్నట్లు సమాచారం. హైవేపై ఉన్న టోల్‌ ప్లాజా ఛార్జీల కంటే తక్కువగా వసూలు చేయడంతో వాహనదారులు కూడా దీనిపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. దీనిపై ఇటీవల స్థానిక మీడియాల్లో వార్తలు రావడంతో ఈ నకిలీ టోల్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానిక అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తొలి బుల్లెట్‌ రైలు స్టేషన్‌ను వీక్షించారా..?

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగుర్ని అరెస్టు చేశారు. నిందుతుల్లో ఒకరు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా.. పాటిదార్‌ వర్గానికి చెందిన ప్రముఖ నేత కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర కాలంలో ఈ నకిలీ టోల్‌ ప్లాజాతో నిందితులు వాహనదారుల నుంచి దాదాపు రూ.75కోట్లు వసూలు చేసినట్లు స్థానిక మీడియా కథనాల సమాచారం. అయితే దీని గురించి స్థానిక అధికారులకు తెలిసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాగా.. గుజరాత్‌లో ఇలా ‘నకిలీ’ వ్యవహారం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల దాహోద్‌ జిల్లాలో ఓ నకిలీ ప్రభుత్వ ఆఫీసు గుట్టు బయటపడింది. దాన్ని ఛేదించగా.. జిల్లాలో అలాంటివి మరో ఆరు నకిలీ కార్యాలయాలున్నట్లు తెలిసి పోలీసులు విస్తుపోయారు. ప్రభుత్వ ఆఫీసులంటూ ప్రజలను నమ్మించి నిందుతులు గత కొన్నేళ్లుగా రూ.18కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సహా పలువుర్ని పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని