Bangladesh MP Murder: ఎంపీ హత్య కేసు.. సెప్టిక్‌ ట్యాంకులో మాంసం ముద్దలు!

కోల్‌కతాలో బంగ్లాదేశ్‌ ఎంపీ హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న ఫ్లాట్‌లోని సెప్టిక్‌ట్యాంక్‌లో మాంసం ముద్దలు, వెంట్రుకలను దర్యాప్తు బృందాలు గుర్తించాయి.      

Published : 29 May 2024 01:33 IST

కోల్‌కతా: బంగ్లాదేశ్‌ (Bangladesh)కు చెందిన ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ (53) కోల్‌కతా (Kolkata)లో ఇటీవల దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఆయన హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న అపార్ట్‌మెంట్‌లోని సెప్టిక్‌ ట్యాంక్‌లో బెంగాల్‌ సీఐడీ దర్యాప్తు బృందాలు తాజాగా మాంసపు ముద్దలు గుర్తించాయి. మొత్తం మూడున్నర కిలోల మాంసం ముద్దలు, కొన్ని వెంట్రుకలు సెప్టిక్‌ ట్యాంక్‌లో లభ్యమైనట్లు ఓ దర్యాప్తు అధికారి వెల్లడించారు. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించామని, డీఎన్‌ఏ పరీక్షల్లో ఆ శరీర భాగాలు అనర్‌కు చెందినవో కావో తెలుస్తాయన్నారు.

కేసు దర్యాప్తులో భాగంగా ఆయన హత్యకు గురైన ఫ్లాట్‌లోని బాత్‌రూమ్‌ ద్వారా రక్తం మురుగునీటి పైపులగుండా వెళ్లినట్లు భావించామని పోలీసు అధికారి తెలిపారు. హౌసింగ్‌ కాంప్లెక్స్‌ బాధ్యుల సహాయంతో ఆ మురుగునీటి పైపులైన్లు, సెప్టిక్‌ ట్యాంకును పరిశీలించినట్లు అధికారి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మాంసపు ముద్దలను గుర్తించినట్లు తెలిపారు.

బంగ్లాదేశ్‌ అధికార పార్టీ అవామీ లీగ్‌కు చెందిన ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ వైద్య చికిత్స కోసం ఈ నెల 12న కోల్‌కతా వచ్చారు. తన స్నేహితుడికి చెందిన అపార్ట్‌మెంట్‌లో బస చేసిన ఆయన.. కొన్నిరోజుల తర్వాత నుంచి కనిపించకుండా పోయారు. దీంతో రంగంలోకి దిగిన కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓ మహిళ సహాయంతో నిందితులు ఆయనను హనీట్రాప్‌లోకి దింపి, ఆయన బస చేసిన అపార్ట్‌మెంట్‌లోనే గొంతు నులుమి హత్యచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

నిందితుడు వృత్తిరీత్యా కసాయి అని, ఎంపీని హత్య చేసిన అనంతరం శరీరాన్ని 80 ముక్కలుగా చేసి, వాటికి పసుపు కలిపి నగరంలోని బాగ్జోలా కాలువ, ఇతర ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా ఆయన శరీర భాగాల కోసం పోలీసులు ముమ్మర వేట ప్రారంభించారు. అయితే వాటిని గుర్తించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. ఇటీవల వర్షాలు కురవడంతో శరీర భాగాలు కొట్టుకొనిపోయి ఉంటాయని, జంతువులు కూడా వాటిని తినే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన బృందం కోల్‌కతాలో దర్యాప్తు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని