Viral video: స్కూల్‌లో ఫేషియల్‌ చేయించుకున్న ప్రిన్సిపల్‌.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి

ఉత్తరప్రదేశ్‌లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్‌ చేయించుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 19 Apr 2024 15:52 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్‌ చేయించుకుంటున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నావ్‌ జిల్లా, దండమౌ గ్రామంలోని  ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ విద్యార్థులకు పాఠాలు బోధించకుండా పాఠశాలలో ఫేషియల్‌ చేయించుకున్నారు. విద్యార్థులకు ఆహారం వండే గదిలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్‌ చేయించుకుంటుండగా అనమ్ ఖాన్ అనే ఉపాధ్యాయురాలు దాన్ని వీడియో తీశారు. దీన్ని గమనించిన సంగీతాసింగ్‌ ఒక్కసారిగా కుర్చీపై నుంచి లేచి ఉపాధ్యాయురాలితో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆమెపై దాడి చేసి ఫోన్ లాక్కునే క్రమంలో చేయిని కొరకడంతో ఉపాధ్యాయురాలికి గాయమై రక్తస్రావం అయ్యింది.  

ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్‌ చేయించుకుంటున్న వీడియోతో పాటు తాను గాయాలతో ఉన్న వీడియోను సైతం అనమ్‌ ఖాన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో రెండు వీడియోలు వైరల్‌గా మారాయి. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయురాలిపై విచారణకు ఆదేశించారు. అనమ్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని