Freebies: రాజకీయ పార్టీల ఉచిత హామీలపై చర్చ జరగాలి: దువ్వూరి సుబ్బారావు

Freebies: రాజకీయ పార్టీల ఉచిత హామీలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు కీలక వ్యాఖ్యలు చేశారు. వీటిపై ఆంక్షల విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దానికి కేంద్రమే చొరవచూపాలని సూచించారు. 

Published : 21 Apr 2024 10:32 IST

హైదరాబాద్‌: ఉచిత హామీల (Freebies) విషయంలో రాజకీయ పార్టీలపై ఆంక్షలు ఎలా విధించాలనే అంశంపై సమగ్ర చర్చ జరగాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు (D Subbarao) అన్నారు. ఈ విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిన అసవరం ఉందన్నారు. అందుకోసం ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. ఈ మేరకు ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని హితవు పలికారు.

ఉచిత హామీలకు (Freebies) అయ్యే వ్యయం-చేకూరే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సుబ్బారావు (D Subbarao) సూచించారు. ఆ బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. భారత్‌ వంటి పేద దేశంలో అత్యంత బలహీనవర్గాలకు కొన్ని భద్రతలను కల్పించడం దాని బాధ్యత అని గుర్తుచేశారు. అదే సమయంలో ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాటిని ఎంత వరకు విస్తరించవచ్చనేది సమీక్షించుకోవాలన్నారు.

మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినా..పేద దేశంగానే భారత్‌!:దువ్వూరి

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను కొన్ని రాష్ట్రాలు అధిగమించడంపై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం తప్పనిసరని సుబ్బారావు తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి కచ్చితంగా కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే ఏటా 7.6 శాతం వృద్ధిరేటు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చైనా వంటి కొన్ని దేశాలు దీన్ని సాధించగలిగాయన్నారు. వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయాల వంటి సవాళ్ల మధ్య భారత్‌ దాన్ని ఎంత వరకు కొనసాగించగలదనేది చెప్పడం కష్టమని అభిప్రాయపడ్డారు.

అభివృద్ధి చెందిన దేశానికి చట్టబద్ధ పాలన, బలమైన ప్రభుత్వం, ప్రజాస్వామ్య జవాబుదారీతనం, పటిష్ఠ సంస్థలు.. నాలుగు స్తంభాల్లాంటివని దువ్వూరి వివరించారు. ‘‘ఈ నాలుగు మనకు లేవని చెప్పలేం. అదే సమయంలో అవన్నీ ఉన్నాయనీ అనుకోలేని పరిస్థితి. వాటిని మరింత పటిష్ఠపర్చాల్సిన అవసరం ఉంది’’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు