Pune Car Crash: ఆ బాలుడికి పోలీస్‌స్టేషన్‌లో పిజ్జా, బిర్యానీ

Pune Car Crash: ఓ బాలుడి ర్యాష్ డ్రైవింగ్‌తో ఇద్దరు మృతి చెందిన ఘటనలో నిందితుడైన మైనర్‌ బాలుడికి పోలీసులు స్టేషన్‌లో సకల మర్యాదలు చేసినట్లు తెలుస్తోంది. అతడికి పిజ్జా, బిర్యానీ అందించినట్లు సమాచారం.

Updated : 21 May 2024 18:05 IST

పుణె: మహారాష్ట్ర (Maharashtra)లోని పుణెలో ఓ బాలుడు లగ్జరీ కారుతో బైక్‌ను ఢీకొట్టి ఇద్దరి మరణానికి కారణమైన కేసు (Pune Car Crash Case)లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  ఇందులో నిందితుడు స్థానికంగా ప్రముఖ వ్యక్తి కుమారుడు కావడంతో పోలీసులు అతడిని వీఐపీలా ట్రీట్‌ చేసినట్లు తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్‌లో అతడికి పిజ్జా, బిర్యానీ అందించినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.

పుణెలో ఆదివారం తెల్లవారుజామున ఓ బైక్‌ను లగ్జరీ కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో కారు డ్రైవ్‌ చేసిన నిందితుడు ఓ మైనర్‌ బాలుడు అని గుర్తించిన పోలీసులు అతడిని, అతడితో పాటు ఉన్న స్నేహితులను యార్వాడ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీసుల అనుమతితో తల్లిదండ్రులు అతనికి పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీ ఆర్డర్‌ చేసినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్‌ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తూ పోలీసుస్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు.

ఇద్దరు నడిరోడ్డుపై ప్రాణాలు కోల్పోతే.. 15 గంటల్లో బెయిలా..?

ఈ కేసులో నిందితుడికి 15 గంటల్లోనే బెయిల్‌ రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అతడి బెయిల్‌ను రద్దు చేసి అరెస్టు చేయాలని మృతుల కుటుంబాలు డిమాండ్‌ చేస్తున్నాయి. బెయిల్‌ సమయంలో కోర్టు విధించిన షరతులు కూడా చర్చనీయాంశమయ్యాయి. 300 పదాల్లో ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో పని చేయాలంటూ న్యాయస్థానం చెప్పడం గమనార్హం.

మరోవైపు, లైసెన్సు రాకుండానే బాలుడికి కారు ఇచ్చిన నిందితుడి తండ్రిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఘటన సమయంలో బాలుడు మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. అతడికి మద్యం విక్రయించిన రెండు బార్ల యజమానులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఓ బారును అధికారులు తాజాగా సీజ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని