LS polls: డిపాజిట్‌ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’

తొలి లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 71 వేల మంది ‘సెక్యూరిటీ డిపాజిట్‌’ కోల్పోయినట్లు ఈసీ విశ్లేషణలో వెల్లడైంది.

Published : 19 Mar 2024 17:44 IST

దిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో అనేక మంది డిపాజిట్లు కోల్పోతుండటం చూస్తూనే ఉంటాం. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి తాను పోటీచేసే నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు ఓట్లను సాధిస్తేనే ధరావతు దక్కుతుంది. ఇలా తొలి లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 71 వేల మంది ‘సెక్యూరిటీ డిపాజిట్‌’ కోల్పోయినట్లు ఈసీ విశ్లేషణలో వెల్లడైంది. అయితే, వీటిని కాపాడుకోవడంలో జాతీయ పార్టీలు ముందున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) నివేదిక ప్రకారం.. దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకు 91,160 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో 71,246 మందికి డిపాజిట్లే రాలేదు. అంటే 78 శాతం అభ్యర్థులకు ధరావతు దక్కలేదన్నమాట. 1951-52లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో 1874 మందికి గాను 745 మంది అభ్యర్థులు డిపాజిట్‌ కోల్పోయారు. క్రమంగా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది.

11వ లోక్‌సభలో రికార్డు..

1991-92లో 86శాతం మంది అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్లు కోల్పోయారు. 1996లో 11వ లోక్‌సభ ఎన్నికల్లో 91 శాతం అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. మొత్తం 13,952 అభ్యర్థులు బరిలో ఉండగా.. 12,688 మందికి చుక్కెదురైంది. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీపడిన లోక్‌సభ ఎన్నికలు కూడా ఇవే కావడం గమనార్హం. 2009లో 85 శాతం, 2014లో 84 శాతం అభ్యర్థులు డిపాజిట్‌ కోల్పోయారు.

బీఎస్పీలో ఎక్కువ..

2019 ఎన్నికల్లో 86 శాతం మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. పార్టీ వారీగా చూస్తే బీఎస్పీ అగ్రస్థానంలో నిలిచింది. 383 మంది పోటీ చేస్తే అందులో 345 మంది ధరావతు కోల్పోయారు. ఈ తర్వాతి స్థానంలో ఉన్న కాంగ్రెస్‌లో.. 421 అభ్యర్థులకుగాను 148 మంది డిపాజిట్‌ కోల్పోవడం గమనార్హం. ధరావతు కోల్పోతామని ముందే తెలిసినా తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు అనేక మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం అసలైన అభ్యర్థులకు నకలుగా (ప్రాక్సీగా) వారిని బరిలో దించుతారని పేర్కొంటున్నారు.

LS polls: ఎన్నికల నియమావళి.. తొలి ‘కోడ్‌’ కూసింది అప్పుడే!

తొలి సార్వత్రిక ఎన్నికల సమయంలో సెక్యూరిటీ డిపాజిట్‌ కింద జనరల్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.250 ఉండేది. ప్రస్తుతం అది జనరల్‌ అభ్యర్థులకు రూ.25 వేలు, ఎస్సీ/ఎస్టీలకు రూ.12,500లకు పెరిగింది. ఇలా డిపాజిట్‌ విలువ భారీగా పెంచినప్పటికీ అభ్యర్థుల సంఖ్యను ఇది కట్టడి చేయలేకపోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని