Electoral bonds: ఎన్నికల బాండ్లు.. ఆ రహస్యాలు చెప్పలేం: ఎస్‌బీఐ

Electoral bonds: ఎన్నికల బాండ్ల విక్రయాలకు సంబంధించిన ఎస్‌వోపీ ప్రక్రియను బయటపెట్టేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిరాకరించింది.

Published : 02 Apr 2024 17:19 IST

దిల్లీ: ఎన్నికల బాండ్ల (Electoral bonds) పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడంతో.. ఈ పథకం కింద రాజకీయ పార్టీలకు వచ్చిన వివరాలను ఎన్నికల సంఘం (EC) బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాండ్ల విక్రయాలకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (SOP) వెల్లడించాలంటూ సహ చట్టం కింద దరఖాస్తు దాఖలైంది. అయితే, ఈ వివరాలు బయటపెట్టేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) నిరాకరించింది.

ఎన్నికల బాండ్ల విక్రయాలు, ఎన్‌క్యాష్‌ కోసం తమ అధీకృత బ్రాంచీలకు ఎస్‌బీఐ జారీ చేసిన ఎస్‌వోపీ వివరాలను చెప్పాలంటూ హక్కుల కార్యకర్త అంజలి భరద్వాజ్‌ సహ చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనిపై ఎస్‌బీఐ సమాధానమిచ్చింది. ‘‘అది మా అంతర్గత మార్గదర్శకాల కిందకు వస్తుంది. వాణిజ్య, వ్యాపార రహస్యాలు, మేధోపరమైన సంపదకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించకుండా చట్టంలో మినహాయింపులు ఉన్నాయి’’ అని స్టేట్ బ్యాంక్‌ స్పష్టం చేసింది.

తిహాడ్‌ జైల్లో కేజ్రీవాల్‌.. తొలిరోజు నీరసం, పడిపోయిన షుగర్‌ లెవల్స్‌!

దీనిపై అంజలి భరద్వాజ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని చెప్పిన సుప్రీంకోర్టు.. వాటికి సంబంధించిన అన్ని వివరాలను బయటపెట్టాలని ఆదేశించింది. అయినప్పటికీ ఎస్‌బీఐ కీలక సమాచారాన్ని పంచుకునేందుకు నిరాకరిస్తోంది’’ అని ఆరోపించారు. ఈ ఎస్‌వోపీతో ఎన్నికల బాండ్ల విక్రయం, ఎన్‌క్యాష్‌పై బ్యాంకు ఎలాంటి ఆదేశాలు జారీ చేసిందన్న వివరాలు బయటికొస్తాయన్నారు.

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల (Electoral Bonds) పథకం రాజ్యాంగ విరుద్ధమని ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే గత ఐదేళ్లలో జారీ చేసిన బాండ్ల సమగ్ర వివరాలనూ ఈసీకి అందించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశించగా.. ఎట్టకేలకు మార్చి 21న సమర్పించింది. అనంతరం వాటిని కేంద్ర ఎన్నికల సంఘం తమ వెబ్‌సైట్‌లో ప్రచురించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని