Voter Turnout: ఎన్నికల వేళ.. ఈసీని అలా ఆదేశించలేం : సుప్రీం కోర్టు

ఐదు దశలు పూర్తైన నేపథ్యంలో బూత్‌ల వారీగా డేటాను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) పేర్కొంది.

Published : 24 May 2024 13:50 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ఓటింగ్‌కు సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్‌ కేంద్రాల వారీగా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని (Election Commission) ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకునేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) నిరాకరించింది. అలా ప్రచురించేందుకు ఈసీ భారీ స్థాయిలో మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఇప్పటికే ఐదు దశల పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈసీని అలా ఆదేశించలేమని తెలిపింది. లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) పూర్తైన తర్వాత ఈ అంశంపై సాధారణ బెంచ్‌ విచారణ చేస్తుందని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

వలపు వలతో చంపి.. చర్మాన్ని ఒలిచి: బంగ్లా ఎంపీ హత్య కేసులో వెలుగులోకి దారుణాలు

ప్రతి దశలో పోలింగ్‌ పూర్తయిన 48 గంటల్లోగా బూత్‌ల వారీగా ఓటింగ్‌ శాతాలను ఈసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని కోరుతూ ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ADR) సుప్రీం కోర్టులో ఇటీవల మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై 2019లోనే ఏడీఆర్‌ ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. తాజాగా వేసిన మధ్యంతర పిటిషన్‌ను విచారించిన సుప్రీం ధర్మాసనం.. వారం రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని మే 17న ఈసీని ఆదేశించింది. అయితే, పిటిషన్‌దారు చేసిన డిమాండును వ్యతిరేకించిన కేంద్ర ఎన్నికల సంఘం.. అలా సమాచారం ప్రచురిస్తే ఎన్నికల ప్రక్రియకు హాని కలుగుతుందని, యంత్రాంగం గందరగోళానికి గురవుతుందని వివరణ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని