Kejriwal: అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ‘సుప్రీం’ తీర్పు రిజర్వు

తన అరెస్టును సవాల్‌ చేస్తూ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లొచ్చని సూచించింది.

Published : 17 May 2024 18:49 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు(Delhi Excise Policy Scam Case)లో తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వు చేసింది. కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ, ఈడీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు బెంచ్‌ ముందు వాదనలు వినిపించారు.  ‘వాదనలు విన్నాం. తీర్పును రిజర్వు చేశాం. అప్పీల్‌దారు చట్టానికి అనుగుణంగా బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లొచ్చు’’ అని ధర్మాసనం పేర్కొంది. 

దిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 50 రోజుల పాటు  తిహాడ్‌ జైలులో ఉన్న దిల్లీ సీఎంకు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మే 10న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. తిరిగి జూన్‌ 2న జైలులో లొంగిపోవాల్సి ఉంటుందని సూచించింది.  ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్‌ మంజూరుచేస్తున్నందున కేజ్రీవాల్‌ ఈ 21 రోజులు ముఖ్యమంత్రి కార్యాలయం/సచివాలయానికి వెళ్లరాదని, అధికారిక దస్త్రాలపై సంతకాలు చేయరాదని ధర్మాసనం షరతు విధించింది. అయితే, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతి పొందడం తప్పనిసరి అయిన అత్యవసర దస్త్రాలపై సంతకం చేయడానికి మాత్రం మినహాయింపు ఉంటుందని స్పష్టంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని