PM Modi: నవాబులు, సుల్తాన్‌ల అరాచకాలపై మౌనమా?: రాహుల్‌పై మోదీ ధ్వజం

రాజులు, మహారాజులను అవమానించిన రాహుల్‌ గాంధీ.. బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తానుల అరాచకాలపై మౌనంగా ఉన్నారని ప్రధాని మోదీ విమర్శించారు.

Updated : 28 Apr 2024 16:10 IST

బెళగావి: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ (Narendra Modi) విరుచుకుపడ్డారు. రాజులు, మహారాజులను అవమానించిన ఆయన.. బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తానుల అరాచకాలపై మౌనంగా ఉన్నారని అన్నారు. బెళగావిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను కాంగ్రెస్‌ రాయించిందన్నారు.

‘కాంగ్రెస్‌ యువరాజు నేటికీ ఆ పాపాలను కొనసాగిస్తున్నారు. రాజులు, మహారాజులు పేదల భూములను ఆక్రమించారని ఆయన (రాహుల్) ఆరోపించారు. తద్వారా ఛత్రపతి శివాజీ మహారాజ్‌, కిట్టూరు రాణి చెన్నమ్మ వంటి మహానుభావులను అవమానించారు. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసమే అటువంటి ప్రకటనలు చేశారు. కానీ, దేశ చరిత్రలో నవాబులు, నిజాంలు, సుల్తానులు, బాద్‌షాలు చేసిన దౌర్జన్యాలపై మాత్రం ఆయన నోరు మెదపలేదు’ అని మోదీ విమర్శించారు.

మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు అణచివేతల గురించి రాహుల్‌ మరచిపోయారన్న మోదీ.. ఎన్నో దేవాలయాలను అపవిత్రం చేసి, ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తిని ప్రశంసించే వారితో కాంగ్రెస్‌ పొత్తులు పెట్టుకోవడం విచారకరమన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని అన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన దాడులు సిగ్గుచేటన్నారు. ఇవి కర్ణాటక కీర్తిని దిగజారుస్తున్నాయని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని