Space warfare: ‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్‌ చౌహాన్

అంతరిక్షం కూడా భవిష్యత్‌ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.

Updated : 18 Apr 2024 16:04 IST

దిల్లీ: అంతరిక్షం కూడా యుద్ధాలకు వేదికగా మారిందని తాను విశ్వసిస్తున్నట్లు భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. గగనతల, సముద్ర, భూ భాగాలపై దీని ప్రభావం తప్పక ఉంటుందన్నారు. దిల్లీలో మూడు రోజుల పాటు జరగనున్న ఇండియన్‌ డిఫెన్స్‌ స్పేస్‌ సింపోజియమ్‌-24 కార్యక్రమంలో వీడియో ద్వారా ప్రసంగం చేసిన ఆయన.. ‘అంతరిక్ష దౌత్యం’ అనేది త్వరలోనే వాస్తవరూపం దాలుస్తుందన్నారు. భవిష్యత్‌ యుద్ధాల్లో రోదసి పాత్ర గురించి సీడీఎస్‌ ప్రముఖంగా ప్రస్తావించారు.

‘‘అంతరిక్షం అనేది చివరి సరిహద్దు. దాని విస్తీర్ణం అనంతం. అది పెరుగుతూనే ఉంది. ఇతర సరిహద్దుల మాదిరిగా దాని ఎల్లలను స్పష్టంగా నిర్వచించడం కష్టం. రోదసి రహస్యాలను ఛేదించేందుకు మానవుడు ఎంతో దూరం వెళ్లాల్సి ఉంది. ఆ ప్రయాణంలో భారత్‌ కూడా భాగం కావాలని కోరుకుంటోంది. భవిష్యత్‌ యుద్ధాలకు అంతరిక్షాన్ని ఓ వేదికగా పరిగణిస్తుంటారు. ఇప్పటికే అది స్థాపించబడిందని విశ్వసిస్తున్నా. గగనతలం, సముద్ర, భూభాగంపైనా దీని ప్రభావం ఉంటుంది’ అని సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ అభిప్రాయపడ్డారు.

జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!

స్పేస్‌ అనేది ‘గ్లోబల్‌ కామన్స్‌’గా పేర్కొన్న చౌహాన్‌.. అక్కడ సార్వభౌమాధికారం అనే భావన ఉండదన్నారు. మిత్ర దేశాలకు సహకారం అందించాలనుకుంటే ఓ పొరుగు దేశంగా ఉండాల్సిన అవసరం లేదన్నారు. అంతరిక్ష రంగంలో ఇప్పటివరకు ఇతర దేశాల నుంచి సేవలు పొందుతోన్న భారత్‌.. ప్రపంచదేశాలకు సేవలందించే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. మరోవైపు, భారత్‌ చేపట్టనున్న ‘గగన్‌యాన్‌’ కార్యక్రమానికి సంబంధించి నలుగురు వ్యోమగాములకు శిక్షణ కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) ఛైర్మన్‌ పీవీ కామత్‌, సాయుధ దళాలకు చెందిన ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని