Sunetra Pawar: Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్‌ కేసులో సునేత్ర పవార్‌కు క్లీన్‌ చిట్‌

Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్‌కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్‌ కేసులో క్లీన్‌ చిట్‌ లభించింది.

Published : 24 Apr 2024 18:24 IST

ముంబయి: లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.25 వేల కోట్ల విలువైన కోఆపరేటివ్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ (Ajit Pawar) సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్‌ (Sunetra Pawar)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు పోలీసులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు.

మహారాష్ట్ర స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులో జరిగిన స్కామ్‌కు సంబంధించిన కేసులో ముంబయి పోలీసు ఆర్థికనేరాల విభాగం దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది జనవరిలోనే ముంబయి పోలీసులు క్లోజర్‌ రిపోర్ట్‌ దాఖలు చేశారు. అయితే అందులోని వివరాలు తాజాగా బయటికొచ్చాయి. ఇందులో సునేత్ర పవార్‌, ఆమె భర్త అజిత్‌కు సంబంధించిన లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తాము గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అజిత్‌కు చెందిన జరందేశ్వర్‌ షుగల్‌మిల్‌కు జారీ చేసిన రుణాల విషయంలో బ్యాంకుకు ఎలాంటి నష్టం జరగలేదని నివేదికలో తెలిపారు.

సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్‌ గడ్కరీ

లోక్‌సభ ఎన్నికల వేళ ఈ నివేదిక బయటికి రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం, భాజపాపైనా విపక్షాలు భగ్గుమన్నాయి. ‘‘ఈ కుంభకోణం గురించి గతంలో మోదీ మాట్లాడుతూ పవార్‌ కుటుంబం మొత్తం అవినీతిపరులని ఆరోపించారు. ఇప్పుడు వారు పార్టీ మారగానే పోలీసులు సునేత్ర పవార్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. అంటే భాజపాపై వాషింగ్‌ పౌడర్‌ వ్యాఖ్యలు నిజమేనని మరోసారి రుజువైంది’’ అని శివసేన యూబీటీ నేత ఆనంద్‌ దూబే ఆరోపించారు.

తాజా ఎన్నికల్లో సునేత్ర పవార్‌ ఎన్డీయే తరఫున బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. శరద్‌ పవార్‌ కంచుకోట అయిన ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ఆయన కుమార్తె సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లోనూ ఆమె మరోసారి బరిలోకి దిగుతున్నారు. దీంతో బారామతిలో ఈ వదినా మరదళ్ల సవాల్‌ దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు