Jammu and Kashmir: తెహ్రీక్‌ ఏ హురియత్‌పై కేంద్రం నిషేధం వేటు..!

జమ్మూకశ్మీర్‌లో మరో సంస్థపై కేంద్ర హోంశాఖ నిషేధం వేటు విధించింది. పాక్‌ అనుకూల వైఖరితో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటమే దీనికి ప్రధాన కారణం. 

Updated : 31 Dec 2023 15:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్మూ కశ్మీర్‌(Jammu and Kashmir)లో పాక్‌ అనుకూల వేర్పాటువాద సంస్థ తెహ్రీక్‌ ఏ హురియత్‌ (టీఈహెచ్‌)పై కేంద్రం హోం మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ విషయాన్ని హోం మంత్రి అమిత్‌షా వెల్లడించారు. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం, భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వివరించారు.  ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించని వైఖరికి కట్టుబడి ఉందన్నారు. ఏ వ్యక్తి అయినా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తాము అడ్డుకొంటామన్నారు. 

‘‘తెహ్రీక్‌ ఏ హురియత్‌ను చట్ట విరుద్ధ సంస్థగా ప్రకటిస్తున్నాం. ఉపా చట్టం కింద ఈ నిర్ణయం తీసుకొన్నాం. భారత్‌ నుంచి జమ్మూ కశ్మీర్‌ను వేరు చేసి అక్కడ ఇస్లామిక్‌ పాలన ఏర్పాటు చేయడానికి ఈ సంస్థ పలు ప్రయత్నలు చేసింది’’ అని అమిత్‌షా ఎక్స్‌ పోస్టులో రాసుకొచ్చారు.

కాలిఫోర్నియాలో భయపెడుతున్న రాకాసి అలలు..!

2021లో మరణించిన సయ్యద్‌ అలీషా గిలానీ చాలా కాలం పాటు ఈ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఈ సంస్థ పాక్‌ అనుకూల వైఖరితో పనిచేస్తుంది. ప్రస్తుతం దీనికి మసరత్‌ ఆలం భట్‌ అధ్యక్షత వహిస్తున్నాడు. ఇతడు కూడా భారత వ్యతిరేక.. పాక్‌ అనుకూల వైఖరి తీసుకొన్నాడు.  2010 నాటి జమ్మూకశ్మీర్‌ అల్లర్లతో మసరత్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఇదే కేసులో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద సంస్థలకు ఆర్థికసాయం చేశాడన్న అభియోగంపై 2019లో ఎన్‌ఐఏ అతడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం అతడు తిహాడ్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 

మసరత్‌కు ముస్లిం లీగ్‌ పేరిట రాజకీయ పార్టీ ఉంది. దీనిపై ఈ నెల 27వ తేదీన కేంద్రం నిషేధం విధించింది.  దేశ వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు ఉగ్రవాదానికి సహకారం అందిస్తున్నందుకు గానూ దీనిపై వేటు వేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయాన్ని కూడా అప్పట్లో కేంద్రమంత్రి అమిత్‌షా వెల్లడించారు. 

హురియత్‌ కాన్ఫరెన్స్‌పై కూడా కేంద్రం నిషేధం విధించే అవకాశాలున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఉపా చట్టం కింద ఏ సంస్థ అయినా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే ప్రభుత్వం నిషేధం విధిస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు