Skull of Alum Bheg: 166 ఏళ్ల తర్వాత మాతృభూమికి.. సిపాయిల తిరుగుబాటు వీరుడి పుర్రె

బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో హవల్దారుగా పనిచేసిన భారత వీరుడు ఆలం బేగ్‌ పుర్రె 166 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గత వారం లండన్‌ నుంచి స్వదేశానికి చేరుకొంది.

Published : 06 Aug 2023 07:38 IST

బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో హవల్దారుగా పనిచేసిన భారత వీరుడు ఆలం బేగ్‌ పుర్రె(Skull of Alum Bheg) 166 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గత వారం లండన్‌ నుంచి స్వదేశానికి చేరుకొంది. 1857 నాటి సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న ఆలం బేగ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌ వాసి. ఈయన 46వ బెంగాల్‌ రెజిమెంటులో పదాతిదళ సైనికుడిగా పనిచేసేవారు. ఆంగ్లేయుల ప్రభుత్వంపై తిరుగుబాటులో చురుగ్గా పాల్గొన్న కారణంగా ఆలం బేగ్‌ను దారుణంగా చంపి, పుర్రెను బ్రిటిష్‌ రాణికి కానుకగా లండన్‌కు పంపారు. ఇన్నాళ్లూ లండన్‌లోని ఓ పబ్‌ స్టోర్‌రూంలో పడున్న ఆలం బేగ్‌ పుర్రెను భారత్‌కు తీసుకురావడానికి చండీగఢ్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జె.ఎస్‌.సహరావత్‌ నిరంతర ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం పంజాబ్‌ పోలీసులకు అప్పగించిన ఈ పుర్రెను దిల్లీలో ఉంటున్న ఆలం బేగ్‌ వారసులకు అందజేస్తారు. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జ్ఞానేశ్వర్‌ చౌబే సైతం పుర్రెను అధ్యయనం చేస్తారు. 2014 మార్చిలో పంజాబ్‌లోని అజ్‌నాలా బావిలో దొరికిన 200 పుర్రెలపై అధ్యయనం చేసిన అనుభవం ఈయనకు ఉంది.

  • 1963లో లండన్‌కు చెందిన ఓ జంట ఆలం బేగ్‌ పుర్రెను, దానితోపాటు ఉన్న ఓ లేఖను అక్కడి పబ్‌లో గుర్తించింది. ఆ లేఖలో ఆలం బేగ్‌ వివరాలన్నీ రాసి ఉన్నాయి. భారతదేశ చరిత్రపై పలు పరిశోధన గ్రంథాలు రాసిన లండన్‌ చరిత్రకారుడు ప్రొఫెసర్‌ ఎ.కె.వాగ్నర్‌ అది ఆలం బేగ్‌ పుర్రేనంటూ నిర్ధారించారు. దీంతో ప్రొఫెసర్‌ సహరావత్‌ ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అటు బ్రిటిష్‌ సర్కారుకు లేఖలు రాశారు. ప్రొఫెసర్‌ ఎ.కె.వాగ్నర్‌ను కూడా సంప్రదించారు. దీంతో వాగ్నర్‌ ఆ పుర్రెను సహరావత్‌కు అందజేశారు. ఆలం బేగ్‌ వారసుల నుంచి పుర్రెను తిరిగి స్వాధీనం చేసుకున్నాక దానిపై అధ్యయనం చేస్తామని, తర్వాత సంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియలు జరుపుతామని ప్రొఫెసర్‌ జ్ఞానేశ్వర్‌ చౌబే ‘ఈటీవీ భారత్‌’కు తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని