Electoral bonds: గత ఐదేళ్లలో 22,217 ఎన్నికల బాండ్ల జారీ: సుప్రీంకు ఎస్‌బీఐ అఫిడవిట్‌

Electoral bonds: ఎన్నికల బాండ్లపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేడు సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది. గత ఐదేళ్లలో 22,217 ఎన్నికల బాండ్లను జారీ చేసినట్లు వెల్లడించింది.

Updated : 13 Mar 2024 14:11 IST

దిల్లీ: రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల (Electoral bonds) వివరాలను భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (SBI) బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court)కు తెలిపింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ డేటాను ఎస్‌బీఐ నిన్న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బ్యాంకు సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్‌ సమర్పించింది. ఏప్రిల్‌ 1, 2019 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు మొత్తంగా 22,217 ఎన్నికల బాండ్లను జారీ చేసినట్లు వెల్లడించింది.

‘‘కోర్టు ఆదేశాల మేరకు గత ఐదేళ్లలో మేం జారీ చేసిన ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను మార్చి 12న ఈసీకి ఇచ్చాం. ఈ బాండ్లను ఎవరెవరు ఎంత కొనుగోలు చేశారు? ఏ పార్టీలు ఎంత ఎన్‌క్యాష్‌ చేసుకున్నాయి?వంటి వాటిని అందించాం’’ అని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ అఫిడవిట్‌ సమర్పించారు. గత నెల ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ఎన్నికల బాండ్ల వివరాలు ఈసీ చేతికి

2019 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15, 2024 వరకు మొత్తం 22,217 ఎన్నికల బాండ్లను దాతలు కొనుగోలు చేసినట్లు ఎస్‌బీఐ తమ అఫిడవిట్‌లో పేర్కొంది. ఇందులో 22,030 బాండ్లను పలు రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్‌ చేసుకుని నిధులు తీసుకున్నట్లు తెలిపింది. మిగతా 187 బాండ్లను నిబంధనల ప్రకారం రిడీమ్‌ చేసి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో డబ్బు జమ చేసినట్లు వెల్లడించింది. అయితే, వీటితో ఏ పార్టీకి ఎన్ని నిధులు దక్కాయన్నదానిపై ప్రస్తుతానికి పూర్తి స్పష్టత లేదు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం.. ఈ నెల 15 సాయంత్రం 5గంటల్లోగా ఈసీ ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో బహిరంగపరచాల్సి ఉంది.

కేంద్ర ప్రభుత్వం 2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 30 విడతల్లో ఎస్‌బీఐ వీటిని విక్రయించింది. వ్యక్తులు/సంస్థలు వీటిని కొనుగోలు చేసి అర్హత కలిగిన రాజకీయ పార్టీలకు నిధుల కింద అందించాయి. నిబంధనల ప్రకారం.. జారీ అయిన తేదీ నుంచి 15 రోజుల వరకే ఇవి చెల్లుబాటవుతాయి. ఆలోగా రాజకీయ పార్టీలు వాటిని ఎన్‌క్యాష్‌ చేసుకోవాలి. గడువు ముగిసిన తర్వాత మిగిలిపోయిన బాండ్లకు చెందిన నగదును పీఎం రిలీఫ్‌ ఫండ్‌కు జమ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని