Traffic Jam: ట్రాఫిక్‌ జామ్‌ను తప్పించుకునేందుకు నదిలో డ్రైవింగ్‌.. వీడియో వైరల్‌

Traffic Jam in Himachal Pradesh: భారీ ట్రాఫిక్‌ జామ్‌ నుంచి తప్పించుకునేందుకు కొందరు పర్యాటకులు నదిలో ఎస్‌యూవీని డ్రైవ్‌ చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో కన్పించిన ఈ దృశ్యం.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated : 26 Dec 2023 10:33 IST

శిమ్లా: వరుస సెలవులతో ఉత్తరాది రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో పర్యాటకుల (Tourists) రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌ జామ్‌ (Traffic Jam) నెలకొంది. ఈ ట్రాఫిక్‌ నుంచి తప్పించుకునేందుకు కొందరు పర్యాటకులు రోడ్డు మార్గాన్ని వదిలి ఏకంగా నది (River)లో నుంచి ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని లహాల్‌ వ్యాలీలో గల చంద్రా నదిలో నుంచి కొందరు ప్రయాణికులు సోమవారం సాయంత్రం థార్‌ ఎస్‌యూవీలో ప్రయాణించారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో నదిలో నీటి మట్టం తక్కువగా ఉండటంతో వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, పర్యాటకుల తీరుపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

దీంతో స్పందించిన పోలీసులు ఆ వాహనానికి చలానా వేశారు. దీనిపై స్థానిక ఎస్పీ మాట్లాడుతూ.. ‘‘చంద్రా నదిలో థార్‌ వాహనాన్ని డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్లిన ఘటన మా దృష్టికి వచ్చింది. సదరు వాహనంపై చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తాం. నదీ ప్రాంతంలో పోలీసు సిబ్బందిని మోహరించాం’’ అని వెల్లడించారు.

ఈ ట్రాఫిక్‌ క్లియర్‌ అయ్యేలోగా.. హాలిడే అయిపోతుందేమో..! మనాలి జామ్‌పై నెటిజన్ల రియాక్షన్‌

క్రిస్మస్‌, కొత్త సంవత్సర వేడుకల వేళ హిమాచల్‌ ప్రదేశ్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. దీంతో మనాలి, అటల్‌ టన్నెల్‌ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పొగమంచు కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు కొన్నిగంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. కిలోమీటర్ల మేర వాహనాలు వరుస కట్టిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. 

గత మూడు రోజుల్లో అటల్‌ టన్నెల్‌ మార్గంలో దాదాపు 55వేల వాహనాలు ప్రయాణించాయని అధికారులు తెలిపారు. న్యూ ఇయర్‌ వేడుకల కోసం ఈ వారంలో మరో లక్షకు పైగా వాహనాలు శిమ్లాకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు స్పందిస్తూ.. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని