Rakesh Sharma: అంతరిక్షం నుంచి ఇందిరాగాంధీతో సంభాషించిన వేళ..!

తొలిసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన భారతీయుడిగా రికార్డు సృష్టించిన రాకేశ్‌ శర్మ (Rakesh sharma).. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో సంభాషించారు.

Updated : 27 Feb 2024 18:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ (Gaganyaan) విషయంలో యావత్‌ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందుకు సంబంధించి నలుగురు వ్యోమగాములకు కఠోర శిక్షణ కొనసాగుతోంది. తాజాగా వీరి పేర్లను ప్రకటించిన ప్రధాని మోదీ.. 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారని చెప్పారు. ఇక్కడినుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు ఘనత సాధించనున్నప్పటికీ... తొలిసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన భారతీయుడు మాత్రం రాకేశ్‌శర్మ (Rakesh sharma). నాటి జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుంటే..

ఎయిర్‌ఫోర్స్‌ మాజీ పైలట్‌ రాకేశ్‌ శర్మ.. ఏప్రిల్‌ 3, 1984న సోవియట్‌ వ్యోమనౌక (సూయజ్‌ టీ-11)లో అంతరిక్షయానం చేశారు. సెల్యూట్‌ 7 స్పేస్‌ స్టేషన్‌లో భూమి చుట్టూ తిరుగుతూ దాదాపు ఎనిమిది రోజులు గడిపారు. ఆ సమయంలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీతో అంతరిక్షం నుంచే సంభాషించే అవకాశం వచ్చింది. స్పేస్‌ నుంచి భారత్‌ ఎలా కనిపించింది? అని ఇందిరా అడిగిన ప్రశ్నకు.. ‘సారే జహా సే అచ్ఛా’ (ప్రపంచంలో అన్నింటికంటే ఉత్తమమైంది) అంటూ రాకేశ్‌ ఇచ్చిన సమాధానం చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచింది. భారరహిత స్థితిలో అనుభూతి గురించి రాకేశ్‌ను అడగగా.. సిమ్యులేటర్‌లో ఉన్నట్లే అనిపించిందని, కఠోర శిక్షణ వల్లే అది సాధ్యమైందని చెప్పారు.

Gaganyaan: అంతరిక్షానికి వెళ్లే భారతీయులు వీరే.. వ్యోమగాముల పేర్లు ప్రకటించిన మోదీ

బయో మెడిసిన్‌, రిమోట్‌ సెన్సింగ్‌లను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ఆ మిషన్‌.. భారత్‌ చేసిన అనేక ప్రయోగాల్లో సాంకేతిక అధ్యయనానికి దోహదపడింది. భారత్‌-సోవియట్‌లు సంయుక్తంగా చేపట్టిన ఆ మిషన్‌ దేశ అంతరిక్ష పరిశోధనలకూ ఎంతో ఊతమిచ్చింది. మళ్లీ సుమారు నాలుగు దశాబ్దాల అనంతరం స్వదేశీ వ్యోమనౌకలో నలుగురు భారతీయులను అంతరిక్షంలో పంపించేందుకు ‘గగన్‌యాన్‌’ సిద్ధమవుతోంది. భారత వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ సుభాన్షు శుక్లాలు వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు